Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాలతోనే సూచీలు ట్రేడయినా బ్యాంకింగ్ స్టాక్స్ పతనం కావడంతో నష్టాలతోనే ముగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణం ఆందోళనకర రీతిలోనే కొనసాగుతుండటంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గించే విషయమై మరింత జాప్యమయ్యే సంకేతాలు వెలువడటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది.
ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 455 పాయింట్లు (0.63శాతం) నష్టపోయి, 72,489 పాయింట్ల వద్ద నష్టపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 152 పాయింట్ల నష్టంతో 21,996 పాయింట్ల వద్ద స్థిర పడింది. సెన్సెక్స్’లో నెస్ల్టే ఇండియా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ స్టాక్స్ 2-3శాతం నష్టపోగా, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ స్టాక్స్ కూడా నష్టాలతోనే ముగిశాయి.
నెస్లే ఇండియా తన మిల్క్ పొడిలో పంచదార కలిపిందని ఆంగ్ల దిన పత్రికలో వచ్చిన వార్తలను కేంద్రం సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. దీంతో నెస్లే ఇండియా షేర్ భారీగా నష్టపోయింది. జస్ట్ డయల్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 32 శాతం గ్రోత్ సాధించి రూ.115.6 కోట్ల నికర లాభం గడించిందన్న వార్తలతో ఆ సంస్థ షేర్ 13 శాతం పుంజుకున్నది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం రూ.లక్ష కోట్లు తగ్గి రూ.393.26 లక్షల కోట్లకు పడిపోయింది. బీఎస్ఈ 30 ఇండెక్సులో 1930 స్టాక్స్ నష్టాలతో, 1867 స్టాక్స్ లాభాలు గడించగా, 132 స్టాక్స్ యధాతథంగా ముగిశాయి.