Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చేరువ కావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. తత్ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 941.88 పాయింట్లు (1.18 శాతం) పాయింట్ల నష్టంతో 78,782.24 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 309 పాయింట్లు (1.27శాతం) పతనమై 23,995.35 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ-50లోని 42 స్టాక్స్ నష్టపోయాయి. వాటిలో హీరో మోటో కార్ప్, గ్రాసిం ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ తదితర స్టాక్స్ 4.25 శాతం వరకూ నష్టాలను చవి చూశాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహా ఎనిమిది స్టాక్స్ 2.14 శాతం లాభాలు గడించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100 1.31 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ -100 1.98 శాతం నష్టాలతో సరి పెట్టుకున్నాయి. అన్ని సెక్టార్ల ఇండెక్సులు నష్టాలతోనే ముగిశాయి.