Stocks Bloodbath | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా ఐదో రోజు బ్లడ్ బాత్ కొనసాగింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 1,158 (2.14 శాతం) పాయింట్లు నష్టపోయింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 15,850 (2.22 శాతం) పాయింట్లకు దిగువన స్థిర పడింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్క్రిప్ట్ 13 శాతం, అదానీ గ్రీన్ స్టాక్ తొమ్మిది శాతం నష్టాలతో ముగిశాయి. కేవలం గురువారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.5 లక్షల కోట్లకుపైగా సంపద కోల్పోయారు. గత నెల 11 నుంచి మదుపర్లు రూ.34 లక్షల కోట్ల నష్టాన్ని చవి చూశారు.
బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.26 లక్షల కోట్లు నష్టపోయి రూ.246.31 లక్షల కోట్ల నుంచి రూ.241.05 లక్షల కోట్ల వద్ద స్థిర పడింది. గత నెల 11న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.275.17 లక్షల కోట్లుగా ఉంది. గత ఐదు సెషన్లలో నిఫ్టీ-50 ఇండెక్స్ ఐదు శాతం నష్టాన్ని చవి చూసింది. 2021 జూలై తర్వాత నిఫ్టీ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పట్టు బిగించింది. దీనికితోడు ధరలు పెరుగుతాయన్న ఆందోళన ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ను బలహీన పరిచింది. ఫలితంగా ప్రారంభం నుంచే స్టాక్స్ ట్రేడింగ్ నష్టాలతో మొదలైంది. 53,608 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ట్రేడింగ్ నష్టాలతోనే సాగింది. ఇంట్రాడే ట్రేడింగ్లో ఒకానొక దశలో సెన్సెక్స్ 52,702 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయి.. ముగింపు సమయానికి 52,930 పాయింట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్లో 15,735 పాయింట్ల నుంచి 16,041 పాయింట్ల మధ్య తచ్చాడి.. ముగిసే సమయానికి 359 పాయింట్ల నష్టంతో 15,808 పాయింట్ల వద్ద ముగిసింది. విప్రో మినహా దాదాపు ప్రధాన షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్, మెటల్, చమురు, విద్యుత్, ఫార్మా, రియాల్టీ రంగాల సూచీలు నాలుగు శాతం లోపు నష్టపోయాయి.