న్యూయార్క్ : లేఆఫ్స్ తప్పవని పేర్కొంటూ ఉద్యోగులకు నిద్రలేని రాత్రులను మిగిల్చిన మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ అన్నంత పనీ చేశారు. సోషల్ మీడియా దిగ్గజం చరిత్రలోనే తొలిసారిగా భారీ లేఆఫ్స్కు తెరలేపారు. తొలి దశలో 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్నట్టు జుకర్బర్గ్ బుధవారం ప్రకటించారు. కంపెనీలో 13 శాతం ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు వెల్లడించారు.
మెటా ఉద్యోగులకు పంపిన మెయిల్ను కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేసిన మేరకు ఈ నిర్ణయాలకు తనదే బాధ్యతని ఆయన చెప్పుకొచ్చారు. ఇది ప్రతి ఒక్కరికి సంక్లిష్ట సమయమని తనకు తెలుసని, ఈ నిర్ణయం ప్రభావానికి గురైన వారందరికీ తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. ప్రకటనల రాబడి తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని వివరించారు.
ఖర్చులకు కళ్లెం
కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిసారిస్తామని, ఈ క్రమంలో వచ్చే ఏడాది తొలి క్వార్టర్ వరకూ నియామకాల ప్రక్రియ నిలిపివేస్తామని చెప్పారు. ఉద్యోగం కోల్పోయిన వారందరికీ ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని, వారికి పరిహారం కింద 16 వారాల వేతనం లభిస్తుందని వెల్లడించారు.
కొలువుల కోతతో టెకీల విలవిల
వ్యయ నియంత్రణ పేరుతో టెక్ కంపెనీలు ముందుగా కొలువుల కోతకు దిగడంతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. కాగా మెటాలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఇటీవల మూడువేల మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతుండటం, మందగమనం నేపధ్యంలో టెక్ కంపెనీలు లేఆఫ్స్కు దిగుతున్నాయి.