LIC | ఢిల్లీ, ఏప్రిల్ 21: ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అయిన మార్చిలో సాధారణంగా బీమా పాలసీల వ్యాపారం జోరుగా సాగుతుంది. ప్రీమియం చెల్లింపుల్ని రిటర్న్ల్లో చూపించి అదాయపు పన్నును కొంతమేర ఆదా చేసుకునేందుకు ఇదే నెలలో కొత్త పాలసీలను తీసుకుంటుంటారు. కానీ 2023 మార్చిలో అంచనాలకు భిన్నంగా జీవిత బీమా పరిశ్రమ కొత్త ప్రీమియం ఆదాయం నిరుడు ఇదే నెలతో పోలిస్తే 12.62 శాతం తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం పరిశ్రమలో దిగ్గజమైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రీమియంలు 30 శాతంపైగా తగ్గడమే. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ విడుదల చేసిన డాటా ప్రకారం ముగిసిన మార్చి నెలలో పరిశ్రమ రూ.52,081 కోట్లకు న్యూ బిజినెస్ ప్రీమియం (ఎన్బీపీ) తగ్గింది. 2022 మార్చిలో ఇది రూ.59,608 కోట్లు. కొత్త పాలసీల ద్వారా వసూలైన ప్రీమియంను ఎన్బీపీగా వ్యవహరిస్తారు.
ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం గత ఏడాది మార్చిలో రూ.42,319 కోట్లుకాగా, తాజాగా ముగిసిన నెలలో 32 శాతం క్షీణతతో 28,716 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయాన్ని మాత్రమే ఆర్జించగలిగింది. గ్రూప్ సింగిల్ ప్రీమియం, గ్రూప్ నాన్-సింగిల్ ప్రీమియం విభాగాలు ఎల్ఐసీ కొత్త వ్యాపారాన్ని దెబ్బతీశాయి. 2023 మార్చిలో ఈ సంస్థ గ్రూప్ సింగిల్ ప్రీమియంలు ఆదాయం 41 శాతం, గ్రూప్ నాన్-సింగిల్ ప్రీమియంలు 82 శాతం చొప్పున తగ్గాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో సైతం ఎల్ఐసీ గ్రూప్ సింగిల్ ప్రీమియంల ఆదాయం 40 శాతం క్షీణించడంతో ఆ సంస్థ ఎన్బీపీ పడిపోయింది. కానీ జనవరి నెలలో మాత్రం ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం 18 శాతం వృద్ధి సాధించడంతో మొత్తం పరిశ్రమ వ్యాపారం ఆ నెలలో 20 శాతం పెరిగింది. ప్రైవేటు సంస్థలు వాటి ఆదాయాన్ని 23 శాతం పెంచుకున్నాయి.
మార్చి నెలలో వాస్తవానికి ప్రైవేటు జీవిత బీమా కంపెనీల ఎన్బీపీ ఆరోగ్యకరంగా 35 శాతం వృద్ధిచెంది రూ.23,364 కోట్లకు చేరింది. ప్రైవేటు సంస్థలు వ్యక్తిగత నాన్-సింగిల్ (వాయిదాలుగా చెల్లించేవి) ప్రీమియంలను 57 శాతం పెంచుకోగలగడంతో అవి ఎన్బీపీలో జోరును ప్రదర్శించాయి. రూ.5 లక్షలకు పైబడిన పాలసీల వ్యాపారం మార్చి మధ్యలో జోరందుకుందని, ఈ విభాగంలో ప్రైవేటు కంపెనీలు ఆధిపత్యం చెలాయించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్చిలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రీమియం 83 శాతం పెరగ్గా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎన్బీపీ 30.77 శాతం పెరిగింది. ఎస్బీఐ లైఫ్ 23.14 శాతం, మాక్స్ లైఫ్ ప్రీమియంలు 42 శాతం చొప్పున పెరిగాయి.
ముగిసిన 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తం జీవిత బీమా సంస్థల ఎన్బీపీ 17.91 శాతం వృద్ధితో రూ.3.7 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. అందులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రీమియంలు 16.67 శాతం పెరిగి రూ.2.31 లక్షల కోట్ల వద్ద నిలిచింది. ప్రైవేటు కంపెనీల ఎన్బీపీ 20 శాతం వృద్ధితో రూ. 1.38 లక్షల కోట్లకు పెరిగింది.