న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గత నెలకుగాను రూ.1.60 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 13 శాతం అధికమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో పన్ను వసూలుకావడం ఇది రెండోసారి కావడం విశేషం. గత నెలలో వసూలైన రూ.1,60,122 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.29,546 కోట్లు కాగా..స్టేట్ జీఎస్టీ కింద రూ.37,314 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 82,907 కోట్లు, సెస్ రూపంలో రూ.10, 355 కోట్ల వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022 ఏప్రిల్ నెలలో వసూలైన రూ.1.68 లక్షల కోట్ల తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి పన్ను వసూళ్లు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్ల కంటే అధికంగా వసూలవడం ఇది నాలుగోసారి.
2022-23లో రూ.18.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.. అంతక్రితం ఏడాది వసూలైన పన్నుతో పోలిస్తే 22 శాతం అధికమని పేర్కొంది. సరాసరిగా ఒక్కో నెలలో రూ. 1.51 లక్షల కోట్ల స్థాయిలో జరిగాయి. గత నెలలో దిగుమతి చేసుకున్న వస్తువులపై వచ్చే ఆదాయం 8 శాతం అధికమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలకుగాను రూ.4,804 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ.4,242 కోట్లతో పోలిస్తే 13.25 శాతం అధికమని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ఏడాది ప్రాతిపదికన 11.26 శాతం పెరిగి రూ.3,174 కోట్ల నుంచి రూ.3,532 కోట్లకు చేరుకున్నాయి.