March GST Collections | 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో జీఎస్టీ వసూళ్లు 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి. 2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అత్యధికంగా జీఎస్టీ వసూలు కావడం ఇది రెండోసారి. దేశీయ లావాదేవీలు 17.6 శాతం పెరగడంతో వల్లే మార్చి జీఎస్టీ వసూళ్లు గణనీయంగా వృద్ధి చెందడానికి కారణం అని కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వార్షిక ప్రాతిపదికన మార్చిలో రీఫండ్స్ మినహాయ జీఎస్టీ రెవెన్యూ నెట్ 18.4 శాతం పుంజుకుని రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి.
గతేడాది ఆర్థిక సంవత్సరంలో మొత్తం జీఎస్టీ వసూళ్లు 11.7 శాతం పెరిగి రూ.20.14 లక్షల కోట్లకు చేరాయి. ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1.68 లక్షల కోట్లకు పెరిగాయి. 2022-23లో సగటున ప్రతినెలా రూ.1.5 లక్షల కోట్ల సగటు జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఏడాది పొడవునా రీఫండ్స్ మినహా నెట్ జీఎస్టీ రెవెన్యూ 13.4 శాతం పెరిగి రూ.18.01 లక్షల కోట్లకు పెరిగింది.
గత నెలలో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) వసూళ్లు రూ.34,532 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) వసూళ్లు రూ.43,746 కోట్లు, రూ.40,322 కోట్ల వివిధ వస్తువుల దిగుమతి సుంకంతోపాటు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ.87,947 కోట్లకు చేరుకున్నది. దిగుమతి వస్తువులపై రూ.996 కోట్లతోపాటు సెస్ వసూళ్లు రూ.12,259 కోట్లు అని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
గతేడాది ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో 12.5 శాతం వృద్ధితో రూ.1.7 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గత ఫిబ్రవరి వసూళ్లు గరిష్టంగా ఐదో స్థానం పొందాయి. 2023 ఏప్రిల్ లో జీఎస్టీ వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లు, 2024 మార్చిలో రూ.1.78 లక్షల కోట్లు, 2024 జనవరిలో రూ.1.74 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ.1.7 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి.