హైదరాబాద్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన పలు పారిశ్రామికవాడలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు చేతులమీదుగా వీటిని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పారిశ్రామికరంగాన్ని పరుగులు పెట్టించే ఉద్దేశంలో భాగంగా టీఎస్ఐఐసీని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 50 కిపైగా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సహా అన్నీ కలుపుకొని గడచిన తొమ్మిదేండ్లలో దాదాపు 23 వేల పరిశ్రమలు ఏర్పాటు కాగా, 17 లక్షలకుపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి.
టీఎస్ ఐ-పాస్ ద్వారా సులభంగా అనుమతులు లభించడంతో దేశ, విదేశాల పెట్టుబడులు రాష్ర్టానికి వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు భూమి లభ్యత ఆధారంగా కొత్త పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తున్నారు. విశాలమైన రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చుతూ పరిశ్రమలకు ఎటువంటి లోటు రాకుండా అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు వివిధ పారిశ్రామికవాడల్లో 28,000 ఎకరాల భూములను కేటాయించారు కూడా.