Medicine Price Hike | వంటగ్యాస్ ధరలు పెంచి వంటింట్లో మంటపెట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. ఎరువుల రేట్లు పెంచి అన్నదాతను ఆగం చేశారు. నిత్యావసరాల ధరలనూ ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. ఇక ఇప్పుడు బతకడానికి వేసుకునే మందుల వంతు. దేశంలోని 90 శాతం జనాభాపై ప్రభావం చూపేలా.. మందుల ధరలనూ భారీగా పెంచబోతున్నది మోదీ సర్కార్. ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు ఏకంగా 12.12 శాతం పెరగనున్నాయి.
ఆకలేస్తే ఏం తినేటట్టు లేదు.. అవసరమొస్తే ఏం కొనేటట్టు లేదు.. చివరకు రోగమొస్తే మింగేందుకు ఏదీ దొరికేటట్టు కూడా లేదు. ఇదీ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాలన తీరు. గడిచిన తొమ్మిదేండ్లలో దేన్నీ వదలకుండా ధరల్ని పెంచుతూపోయిన కేంద్రం.. ఇప్పుడు ఔషధాల ధరలకూ రెక్కల్ని తొడుగుతున్నది. వచ్చే నెల మొదలు పెయిన్ కిల్లర్ దగ్గర్నుంచి షుగర్, బీపీ, గుండె ఇలా అత్యంత ప్రధానమైన ఆరోగ్య సమస్యలకు, ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా కనిపించే రుగ్మతలకు వాడే ప్రతీ మందు గోళి రేటు మండిపోనున్నది మరి. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సగటు మనిషి బతుకుకు భరోసా లేకుండా ఏకంగా ఔషధాల ధరలను ఏప్రిల్ 1 నుంచి 12 శాతానికిపైగా పెంచుతున్నది బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం. నిజానికి కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఇమిటేషన్ ఆభరణాలు ఇలా ఎన్నింటికో బడ్జెట్ సెగ తగులుతున్నది. గట్టిగా చెప్పాలంటే శనివారం నుంచి వీటి ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఈసారి ఈ జాబితాలో ఔషధాలూ చేరాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ వాతల్ని పెట్టిన కేంద్ర పాలకులు.. కూరగాయాలనూ చేశారు. ఇక పన్నుల బాదుడు సరేసరి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో రాష్ర్టాల ఆదాయానికి గండి కొడుతున్న కేంద్రం.. సెస్సుల పేరుతో అదనపు రాబడులను దండిగా దక్కించుకుంటున్నది. తుదకు ఒకప్పుడు ఆన్లైన్ లావాదేవీలనూ నెత్తిన పెట్టుకున్న ప్రభుత్వమే.. ఇప్పుడు వాటిపై చార్జీలకున్న మార్గాలను వెతుకుతుండటం గమనార్హం.
(కే రాజశేఖర్/ స్పెషల్ టాస్క్బ్యూరో) హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): జ్వరం, బీపీ, రక్త హీనత, డయాబెటిస్, గుండె జబ్బులకు వాడే అత్యవసర ఔషధాలు, మెడికల్ డివైజ్ల ధరలు భారీగా పెరిగాయి. అత్యవసర జాబితాలో ఉన్న 800 రకాల ఔషధాల ధరలను కేంద్రప్రభుత్వం ఏకంగా 12.12% పెంచింది. ఈ మేరకు జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి (ఎన్పీపీఏ) వెల్లడించింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్, 2013 ప్రకారం.. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) సరళిని బట్టి ఈ ధరలు నిర్ణయించినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ మందుల ధరలు దాదాపు 60 శాతం వరకు పెరిగాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇతరత్రా కారణాల పేరిట కేంద్రం మందుల ధరలను ఏటేటా పెంచుకుంటూ వస్తున్నది. కరోనా సంక్షోభంలో మందులకు డిమాండ్ పెరిగిందని, ఉచిత వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయన్న సాకు చెప్పి కిందటేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం వడ్డించింది. జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి చరిత్రలో ఔషధ ధరలపై ఈ స్థాయిలో పెంపుదల ఇదే మొదటిసారి.
(ఆధారం: ఎన్పీపీఏ ధరలు,కేంద్ర ప్రభుత్వ గణాంకాలు )
కార్పొరేట్ల రుణాలను ఎడాపెడా రద్దు చేస్తారు. ప్రజల సొమ్మును దోచుకొనే వారికి అండగా ఉంటారు. సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసే దైనందిన అవసరాలైన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాలు, మందుల ధరలను ఎడాపెడా పెంచుతారు. అసలు సామాన్యుడు ఈ దేశంలో బతుకొద్దా?
– శివ, వేములవాడ
నా భార్యకు డయాబెటిస్, బీపీ, నరాల సమస్యలున్నాయి. నాకు వచ్చే నెల జీతం రూ.8 వేలు. ఇందులో రూ. 3 వేలు నా భార్య మందులకే వెచ్చిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం మందుల ధరలను పెంచింది. ఇలా అయితే, నాకొచ్చే జీతంలో ఆమెకు మందులు ఎలా కొనిపెట్టాలి? కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఏం అర్థమవ్వట్లేదు.
– కృష్ణస్వామి నారాయణమూర్తి, సెక్యూరిటీ గార్డు, బెంగళూరు
ఆన్లైన్లో మెడిసిన్ లభ్యమవుతుండటంతో ఇప్పటికే మా గిరాకీ దెబ్బతిన్నది. ఆన్లైన్లోని మర్చంట్స్కు షాప్ కిరాయి, సిబ్బంది ఖర్చు ఉండదు. అందుకే వాళ్లు డిస్కౌంట్లు ఇస్తారు. మాకు అలా కుదరదు. అయినప్పటికీ కస్టమర్లను ఆకట్టుకొనేందుకు కొంత మొత్తంలో డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మందుల ధరలను ఎడాపెడా పెంచితే, కస్టమర్లతోపాటు మాకు కూడా ఇబ్బందే. ఎందుకంటే వాళ్లు ఎక్కువమొత్తంలో డిస్కౌంట్ అడిగే అవకాశమున్నది. అది మాకు నష్టమే కదా!
– మంజునాథ, మెడికల్ షాప్ ఓనర్, కర్ణాటక