KYC | ఖాతాదారుల్ని ‘నో యువర్ కస్టమర్'(కేవైసీ)ను అప్డేట్ చేసుకోవాలని పలు బ్యాంక్లు కోరుతున్నాయి. ఇప్పటికే మీరు బ్యాంక్కు సంబంధిత ధృవపత్రాల్ని సమర్పించి, చిరునామాలో మార్పు లేకపోతే అప్డేట్ కోసం ఆయా బ్యాంక్ శాఖల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. ఈ ఏడాది జనవరి 5న రిజర్వ్బ్యాంక్ జారీచేసిన సర్క్యులర్ ప్రకారం ఈమెయిల్-ఐడీ, రిజిష్టర్డ్ మొబైల్ నంబర్, ఏటీఎంలు లేదా ఇతర డిజిటల్ ఛానళ్ల (ఆన్లైన్ బ్యాంకింగ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ ఆప్లికేషన్) లేదా ఒక లేఖ ద్వారా సెల్ఫ్-డిక్లరేషన్ సమర్పిస్తే చాలు. వ్యక్తిగత ఖాతాదారులు ఈ మార్గాల ద్వారా కేవైసీని అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని బ్యాంక్లకు ఆర్బీఐ సూచించింది.
బ్యాంక్కు గతంలో సమర్పించిన కేవైసీ డాక్యుమెంట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతున్నట్లయితే, చిరునామాలో మార్పు లేకపోతే..మీ కేవైసీ అప్డేట్ చేసుకునేందుకు ఆన్లైన్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. అయితే చిరునామా మారినట్లయితే పైన సూచించిన ఛానళ్ల ద్వారా కొత్త చిరునామా తెలియపర్చాలి. అటుతర్వాత రెండు నెలల లోపు ఆ చిరునామాను బ్యాంక్ వెరిఫై చేసుకోవాలని ఆర్బీఐ సర్క్యులర్లో సూచించింది.
కొంతమంది ఖాతాదారుల కేవైసీ డాక్యుమెంట్ గడువు ముగిసిపోవచ్చు. లేదా సమర్పించిన కేవైసీ డాక్యుమెంట్ తాజాగా అఫీషియల్లీ వ్యాలీడ్ డాక్యుమెంట్ (ఓవీడీ) కాకపోవచ్చు. అలాంటి సందర్భంలో ప్రస్తుత ఓవీడీ జాబితా చూసుకుని, ఆ డాక్యుమెంట్లతో బ్యాంక్ శాఖను సంప్రదించాలి.
కేవైసీ అప్డేషన్ నిబంధనలు పాటించకపోతే ఖాతాదారు లావాదేవీలపై బ్యాంక్లు నియంత్రణలు విధించవచ్చు. బ్యాంక్ ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ చర్య తీసుకునేముందు కేవైసీ అప్డేట్ చేయని ఖాతాదారులకు బ్యాంక్ సమాచారం ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో అప్డేట్ చేయని ఖాతాల్ని బ్యాంక్లు మూసివేయవచ్చు కూడా. తాను పాన్ నంబర్ లేదా తత్సమానమైన ఈ-డాక్యుమెంట్ను లేదా ఫారం 60ని సమర్పించనంటూ బ్యాంక్కు ఖాతాదారు లిఖితపూర్వకంగా రాసిస్తే ఖాతాను క్లోజ్ చేయవచ్చని ఆర్బీఐ తెలిపింది. అటుతర్వాత మూసివేయబడిన ఖాతాను కస్టమర్ గుర్తింపు డాక్యుమెంట్లను తీసుకున్న తర్వాత బ్యాంక్ సెటిల్ చేస్తుంది.