న్యూఢిల్లీ, మార్చి 17: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్..ఈ నెల చివరినాటికి మరో 20 కొత్త షోరూంలను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. రూ.1,580 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ షోరూంలతో 725 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మలబార్ గ్రూపు చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. దీర్ఘకాలికంగా వ్యాపార వృద్ధి లక్ష్యంగా వచ్చే 20 రోజుల్లో 20 షోరూంలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, దీంట్లోభాగంగా తెలంగాణలో హైదరాబాద్, సంగారెడ్డితోపాటు ఝాన్సీ, చిత్తూరు, వైజాగ్, కోల్కతా, జామ్నగర్, హుబ్లీ, గురుగ్రామ్ సెక్టార్ 14 వంటి నగరాల్లో కొత్త షోరూంలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. దీంతో కంపెనీ మొత్తం షోరూంల సంఖ్య 445కు చేరుకోనున్నాయి.