Mahindra XUV.e9 | సంప్రదాయ పెట్రోల్ కార్లలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కార్ల విక్రయంలో టాటా మోటార్స్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. ఈవీల్లో టాటా మోటార్స్ ఆధిపత్యం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో మరో ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పోటీ పడేందుకు సిద్ధమైంది. మున్ముందు ఐదు ఈవీ కార్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఆవిష్కరిస్తారని భావిస్తున్న మహీంద్రా ‘ఎక్స్యూవీ.ఈ9 (XUV.e9)’పై టెస్టింగ్ నిర్వహిస్తున్నారు.
‘ఎక్స్యూవీ.ఈ9’ ఫీచర్లేమిటన్నది మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించకున్నా రెండు బ్యాటరీ సైజులు, సింగిల్ మోటార్ అండ్ డ్యుయల్ మోటార్ టెక్నాలజీతో వస్తుందని తెలుస్తున్నది. సింగిల్ చార్జింగ్ తో 450 కి.మీ పైచిలుకు దూరం ప్రయాణిస్తుందని తెలుస్తున్నది.
మహీంద్రా అండ్ మహీంద్రా ఫ్లాగ్ షిప్ ఎస్యూవీ ‘ఎక్స్యూవీ700’ ఆధారంగా ‘ఎక్స్యూవీ.ఈ9’, ‘ఎక్స్యూవీ.ఈ8’ కార్లు రూపుదిద్దుకుంటున్నాయి. న్యూ ఇంగ్లో ఫ్లాట్ ఫామ్పై ఎలక్ట్రిక్ కార్లు తయారవుతున్నాయి. ఎల్ఈడీ హెడ్ లైట్, డీఆర్ఎల్ యూనిట్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్, త్రీ సెపరేట్ స్క్రీన్స్ కనెక్టెడ్ టుగెదర్ ఫీచర్లు ఉంటాయి. డాష్ బోర్డు మీద డిజిటల్ స్క్రీన్లు కూడా ఉంటాయని తెలుస్తున్నది.