Mahindra XUV400 EV | దేశీయ ఆటోమొబైల్ మహీంద్రా అండ్ మహీంద్రా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ కారు ఎక్స్యూవీ400 ఈవీ మోడల్కు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే ఏడాది అంటే 2023 జనవరిలో దేశీయ మార్కెట్లోకి రానున్నది. వచ్చే డిసెంబర్లో దేశవ్యాప్తంగా 16 నగరాల పరిధిలో తొలి దశలో టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఇక 2023 జనవరిలోనే ప్రీ బుకింగ్స్, కార్ల డెలివరీలు కూడా మొదలవుతాయి. ఎక్స్యూవీ400 ఈవీ కారు తన ప్రత్యర్థి సంస్థలు టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజీ జడ్ఎక్స్ ఈవీ తదితర కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.
కేవలం 8.3 సెకన్లలోనే 100 కి.మీ. స్పీడ్ అందుకోగల సత్తా ఎక్స్యూవీ400 ఈవీ సొంతం. శరవేగంగా దూసుకెళ్లే నాన్ లగ్జరీ సెగ్మెంట్ తొలి ఎలక్ట్రిక్ ఈవీ.. గరిష్టంగా గంటకు 150 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలుగుతుంది. 39.4 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో వస్తున్న ఎక్స్యూవీ400 ఈవీ కారు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 456 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. 50కిలోవాట్ల డీసీ ఫాస్ట్ చార్జర్తో 50 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది.
7.2 కిలోవాట్ల / 32ఏ ఔట్లెట్లో 100 శాతం చార్జింగ్కు 6.30 గంటల సమయం పడుతుంది. 3.3 కిలోవాట్ల /16ఏ డొమెస్టిక్ సాకెట్తో 100 శాతం చార్జింగ్ చేయాలంటే 13 గంటల టైం పడుతుంది. 2040 నాటికి కర్బన రహిత వాహనాలు అందుబాటులోకి తేవడానికి మహీంద్రా అండ్ మహీంద్రా కట్టుబడి ఉందని సంస్థ ఆటోమొటివ్ డివిజన్ అధ్యక్షుడు విజయ్ నక్రా చెప్పారు.