ముంబై, నవంబర్ 10: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆర్థిక ఫలితాల్లో రాణించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.2,348 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,209 కోట్ల కంటే ఇది 6 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం ఎగబాకి రూ.34,436 కోట్లకు చేరుకున్నది. టెక్ మహీంద్రా మినహా మిగతా వ్యాపారాలు అంచనాలకుమించి రాణించినట్టు కంపెనీ ఎండీ, సీఈవో అనీశ్ షా తెలిపారు. మార్కెట్ పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ గత త్రైమాసికంలో వాహన, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు భారీగా పెరిగాయన్నారు. గత త్రైమాసికంలో ఆటోమోటివ్ రంగం నుంచి ఆదాయం 20 శాతం ఎగబాకి రూ.18,869 కోట్లకు చేరుకున్నది.
మహీంద్రా అండ్ మహీంద్రా నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సీపీ గుర్నానీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా వచ్చే నెల 20 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది. టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో నుంచి పదవీ విరమణ చేస్తుండటంతో ఇతర గ్రూపు కంపెనీల నుంచి వైదొలుగుతున్నారు.