కేప్టౌన్, ఆగస్టు 15: మహీంద్రా అండ్మహీంద్రా ఒకేసారి ఏడు ట్రాక్టర్లను విడుదల చేసింది. ఓజా ప్లాట్ఫాంలో విడుదల చేసిన ఈ ట్రాక్టర్లు తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్లోనే తయారు చేయడం విశేషం. 20 హెచ్పీ సామర్థ్యం నుంచి 40 హెచ్పీ లోపు కెపాసిటీతో రూపొందించిన ఈ తేలికైన ట్రాక్టర్లను దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్ వేదికగా ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఓజా ప్లాట్ఫాంలో మరిన్ని మాడళ్లను పరిచయం చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
వీటిలో ఓజా 27 హెచ్పీ ట్రాక్టర్ ధరను సంస్థ రూ.5.64 లక్షలుగా నిర్ణయించింది. అలాగే 40 హెచ్పీ ట్రాక్టర్ మాడల్ ధర రూ.7.35 లక్షలు. తేలికైన ఈ ఓజా ట్రాక్టర్లు అత్యంత శక్తినివ్వనున్నాయని, ప్రగతిశీల రైతులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు మహీంద్రాఅండ్మహీంద్రా ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు. వచ్చే మూడేండ్లలో ట్రాక్టర్ల ఎగుమతులు రెండంతలు పెరిగే అవకాశం ఉన్నదని సిక్కా పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 18 వేల ట్రాక్టర్లను భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లు, అలాగే ఓజా ప్లాట్ఫామ్ను తీర్చిదిద్దడానికి రూ.1,200 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.