EV Cars Cheap | పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతోపాటు పర్యావరణ సంబంధ సమస్యలతో దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్కు పాపులారిటీ పెరుగుతున్నది. కొద్ది నెలలుగా ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు పెరిగిపోయాయి. ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఫీచర్లతో నూతన మోడల్ ఈవీ కార్లు మార్కెట్లో ఆవిష్కరిస్తున్నాయి. మరోవైపు, విద్యుత్ కార్లు కొనుగోలు చేసే కస్టమర్లకు 0.50 శాతం తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు ఆఫర్ చేస్తున్నాయి.
ఈ దీపావళి పండుగ సందర్భంగా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు కోసం తక్కువ వడ్డీపై రుణాలిస్తున్న ప్రధాన బ్యాంకులు.. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు కనిష్ట స్థాయికి తగ్గించడమో.. పూర్తిగా మాఫీ చేస్తున్నాయి. సాధారణ వాహనాలు, కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు 0.10-0.50 శాతం తక్కువ వడ్డీకి రుణాలు ఆఫర్ చేస్తున్నట్లు బ్యాంకుల అధికారులు చెబుతున్నారు.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సాధారణ కార్ల కొనుగోలుదారులకు 7.80% నుంచి 8.65% శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. గ్రీన్ కార్లుగా పేరొందిన ఈవీ కార్ల కొనుగోలుకు 7.95% నుంచి 8.30% వరకు వడ్డీకే రుణాలిస్తున్నది. ఇతర బ్యాంకుల్లో రుణ మొత్తం, టెన్యూర్ వేర్వేరుగా ఉంటాయి.
విద్యుత్ కార్ల కొనుగోలుపైన పన్ను మినహాయింపు కూడా ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయడానికి రుణం తీసుకుంటే ఆదాయం పన్ను చట్టం 80 ఈఈబీ సెక్షన్ కింద రుణ వడ్డీ చెల్లింపుపై రూ.1.50లక్షల వరకు పన్ను మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు కొనుగోలు చేసే ఈ-వెహికల్స్పై డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో ఆవిష్కరిస్తున్నాయని యాక్సిస్ బ్యాంక్ రిటైల్ లెండింగ్ అండ్ పేమెంట్స్ విభాగం హెడ్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సుమిత్ బాలి చెప్పారు. కనుక, ఇప్పుడీ ఈవీ కార్లు మరింత చౌకగా మారాయన్నారు.
ఈవీ కొనుగోలుదారులకు బ్యాంకులు ఆకర్షణీయ రుణాలిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల వరకు గరిష్టంగా సబ్సిడీ అందిస్తున్నది. సంబంధిత వెహికల్ బ్యాటరీ కెపాసిటీని బట్టి సబ్సిడీ ఆధార పడి ఉంటుంది. కేంద్రంతోపాటు కస్టమర్లు ఎలక్ట్రిక్ వెహికల్స్పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీని క్లయిమ్ చేయొచ్చు.