LTCG Tax on Assets Sale | ప్రముఖ గ్రాసరీ చైన్ నెట్వర్క్ డీ-మార్ట్ ఫౌండర్ రాధాకృష్ణన్ దామానీ ఇటీవలే ముంబైలో భారీ స్థాయిలో ఇండ్లు కొనుగోలు చేశారు. రాధాకృష్ణన్ దామానీ కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు రూ.1,238 కోట్లకు ముంబైలో 28 హౌసింగ్ యూనిట్లు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు చెబుతున్నాయి. దీనికి ఓ కారణం ఉంది. వచ్చే ఏడాది నుంచి సూపర్ లగ్జరీ ఆస్తుల క్రయ, విక్రయాలపై కేంద్రం క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ వసూలు చేయనున్నది.
ఇండ్లతో సహా దీర్ఘకాలిక ఆస్తుల క్రయ విక్రయాల నుంచి వచ్చే క్యాపిటల్ గెయిన్స్పైన రూ.10 కోట్ల క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వసూలు చేస్తామని 2023-24 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు ఈ నెల పార్లమెంట్కు సమర్పించారు. ఇంతకుముందు ఆ లిమిట్ లేనే లేదు. ఆదాయం పన్ను చట్టంలోని 54, 54ఎఫ్ సెక్షన్ల ప్రకారం నివాస ఆస్తులపై రీ ఇన్వెస్ట్మెంట్పై రూ.10 కోట్ల లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ (ఎల్టీసీజీ) వసూలు చేస్తుంది ఆదాయం పన్నుశాఖ.
1,82,084 చదరపు అడుగుల కార్పేట్ ఏరియా గల ఈ భవనాల్లో కొన్నింటిని కంపెనీల పేరిట కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఇందులో 101 కార్లు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నెల మూడో తేదీన అన్ని రకాల లావాదేవీలు జరిగినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలను బట్టి తెలుస్తున్నది. ఒక్కో అపార్ట్మెంట్ విలువ సగటున రూ.40-50 కోట్లే. ముంబైలోని వర్లీ ప్రాంత అనిబీసెంట్ రోడ్లో కేంద్రీకృతమైన టవర్బీ ఆఫ్ 36 వెస్ట్లో గల అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు.
రాధాకృష్ణన్ దామానీ ఆస్తులు కొనుగోలు చేయడం ఇదే ఫస్ట్టైం కాదు.. ఇంతకుముందు కూడా రూ.400 కోట్ల విలువైన ఏడు ఆస్తులు కొనుగోలు చేశారు. ఆయన సారధ్యంలో రిటైల్ నెట్వర్క్ సంస్థ డీ-మార్ట్ 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్టోర్లు నిర్వహిస్తున్నది. ముంబైతోపాటు హైదరాబాద్, పుణె, బెంగళూరు నగరాల్లోనూ దామానీ ఇండ్లు కొనుగోలు చేశారు. ఆయన సహజంగానే ఆస్తులు కొనుగోలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప.. వ్యాపార లావాదేవీలకు లీజ్కు తీసుకోరని సమాచారం.