ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్లో 84 వేల మంది రుణం తీసుకున్నారు. అదీ ఎటువంటి అప్రూవల్ లేకుండానే ఆ రుణాలు అందుకున్నారు.. ఈ ఘటన ఈ ఏడాది మే నెలలో అదీ కేవలం రెండు రోజుల్లో జరిగింది. దీనిపై ఇండస్ ఇండ్ బ్యాంక్ శనివారం వివరణ ఇచ్చింది. సాంకేతిక లోపాల వల్ల ఈ పొరపాటు జరిగిందని పేర్కొన్నది. దీనిపై కొందరు వ్యక్తులు రియాక్టయ్యారు. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఫిర్యాదు చేశారు. ఎటువంటి అప్రూవల్ లేకుండా ఇండస్ ఇండ్ బ్యాంక్ రుణాలు మంజూరు చేస్తున్నదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది లోన్ ఎవర్గ్రీనింగ్ అంటూ సదరు ఫిర్యాదు దారుల్లో ఒకరు వ్యాఖ్యానించారు.
సదరు వ్యక్తి ఫిర్యాదు పూర్తిగా తప్పని, అప్రూవల్స్ లేకుండా రుణాలిచ్చినట్లు తమ దృష్టికి రాలేదని శనివారం స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన వివరణలో ఇండస్ ఇండ్ బ్యాంక్ వివరించింది. ఇప్పటివరకు ఇచ్చిన రుణాలు డిఫాల్ట్ అయితే, వాటిని పునరుద్ధరించడమే జరిగిందని, దీన్నే లోన్ ఎవర్గ్రీనింగ్ అంటారని వ్యాఖ్యానించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనూ రుణాల పునరుద్ధరణ జరుగుతుందని తెలిపింది. చెల్లించగల సామర్థ్యం గలవారికి మాత్రమే రుణాలిస్తామని పేర్కొన్నది.
సాంకేతిక లోపంతో కేవలం రెండు రోజుల్లో రుణాలు మంజూరైన విషయమై ఫీల్డ్ ఎంప్లాయీస్ తమ దృష్టికి తెచ్చారని, ఆ తర్వాత సాంకేతిక లోపాన్నిసవరించామని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ అనుబంధ సంస్థ భారత్ ఫైనాన్సియల్ ఆధ్వర్యంలో ఇటువంటి అప్రూవల్ లేని రుణాలు మంజూరయ్యాయని ఓ వ్యక్తి శుక్రవారం బ్యాంక్ మేనేజ్మెంట్కు, ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు.