న్యూఢిల్లీ, ఆగస్టు 2: అప్పు తీసుకున్న సామాన్యుల దగ్గర్నుంచి ముక్కుపిండి నయాపైసా వసూలు చేస్తున్న బ్యాంకులు.. కార్పొరేట్ల రుణాలను మాత్రం లక్షల కోట్లలో రద్దు చేసేస్తున్నాయి. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు దాదాపు రూ.10 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయి. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. 2017-18 నుంచి 2021-22 వరకు రూ.9,91,640 కోట్ల బ్యాంకింగ్ రుణాలు రద్దయ్యాయి. ఈ ఐదేండ్లలో అత్యధికంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో మాఫీ అయ్యాయి. ఆ ఏడాది బ్యాంకులు రూ.2,36,265 కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి.
మెహుల్ చోక్సీనే టాప్
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల వివరాలనూ పార్లమెంట్కు కరాద్ తెలియజేశారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి ఉన్న టాప్ 25 విల్ఫుల్ డిఫాల్టర్ల వివరాలను మంత్రి ప్రకటించారు. ఇందులో పరారీ వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ మొదటి స్థానంలో ఉన్నది.
విల్ఫుల్ డిఫాల్టర్లు 10 వేలపైనే
2018-19 నుంచి 2021-22 వరకు మొత్తం ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 10,306గా ఉన్నట్టు మంత్రి కరాద్ చెప్పారు. 2018-19 నుంచే ఈ డాటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నేతృత్వంలోని సెంట్రల్ రెస్పిరేటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్ఐఎల్సీ) వద్ద రికార్డవుతున్నది. రూ.5 కోట్లు, ఆపై రుణాల ఎగవేతదారుల జాబితానే ఇది. ఇంతకంటే తక్కువ రుణ ఎగవేతదారులు, 2018-19కి ముందు సమాచారం బయటకొస్తే ఈ లిస్టు చాలా పెద్దదే అవుతుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, అన్ని భారతీయ ఆర్థిక సంస్థలు రూ.5 కోట్లు, ఆపై రుణాలు తీసుకున్న తమ రుణగ్రహీతల వివరాలను సీఆర్ఐఎల్సీకి తప్పక తెలియజేయాల్సి ఉంటుంది.