ముంబై: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్య.. తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం తీసుకున్న రూ.6,200 కోట్ల రుణాలను ఆయన మూడు సంస్థల షేర్ల విక్రయంతో జమ చేసుకోవాలని ఎస్బీఐ నిర్ణయించింది. యునైటెడ్ బ్రేవరీస్, యునైటెడ్ స్పిరిట్స్, మెక్డొనాల్డ్ హోల్డింగ్స్ సంస్థల షేర్లను ఈ నెల 23న వేలం వేయనున్నది. ఎస్బీఐ ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియం వద్ద విజయ్ మాల్య రుణాలు తీసుకున్నారు.
యునెట్ బ్రేవరీస్, యునైటెడ్ స్పిరిట్స్, మెక్డొనాల్డ్స్ షేర్ల వేలం విజయవంతమైతే కింగ్ఫిషర్ కేసులో మొండి బకాయిగా మారిన రుణాల వసూళ్లపై బ్యాంకులు గొప్ప పురోగతి సాధించినట్లే. 2012 నుంచి ఈ రుణం మొండి బకాయిగా మారింది.
4.13 కోట్ల యునైటెడ్ బ్రేవరీస్, 25.02 లక్షల యునైటెడ్ స్పిరిట్స్, 22 లక్షల మెక్డొనాల్డ్స్ హోల్డింగ్స్ షేర్లు వేలం వేస్తారు. 23న వేలంలో మొత్తం షేర్లు అమ్ముడవ్వకుంటే 24న రిటైల్ లేదా బల్క్ మోడ్లో విక్రయిస్తారు.
విజయ్మాల్య ఎయిర్లైన్స్ కింగ్ ఫిషర్ విమానాలు 2016 మార్చి నుంచి పైకి ఎగురలేదు. 2012 అక్టోబర్ నుంచి ఈ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. 2016 మార్చి రెండో తేదీన భారత్ నుంచి విజయ్ మాల్య పరారయ్యాడు.
బ్యాంకులను మోసగించి తీసుకున్న రుణాలను చెల్లించలేదని అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. విజయ్ మాల్య పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా దేశ దర్యాప్తు సంస్థలు 2019 జనవరిలో ప్రకటించారు.
విజయ్ మాల్య.. 17 బ్యాంకుల నుంచి దాదాపు రూ.9000 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఈ బ్యాంకుల్లో ఎస్బీఐతోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. తర్వాత రుణ వాయిదాలు గానీ, వడ్డీ గానీ చెల్లించలేదు.
2013 జూన్ 25 నుంచి రూ.6,203 కోట్ల రుణంతోపాటు 11.5 శాతం వడ్డీతో మొత్తం రికవరీ ఆఫీసర్ వసూలు చేస్తారు. బెంగళూరులోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) వేలం ప్రక్రియ చేపట్టనున్నది.
విజయ్ మాల్య ఆస్తులు, సంస్థల్లోని షేర్ల విక్రయం ద్వారా రుణాలు వసూలు చేసుకోవడానికి ఈ నెల ప్రారంభంలో బ్యాంకులకు పీఎంఎల్ఏ కోర్టు అనుమతినిచ్చింది. ఆస్తులు, వివిధ సంస్థల షేర్ల విక్రయం ద్వారా రుణాలు రికవరీ చేసుకోవచ్చు.