న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా భారత్లో ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు రీఎంట్రీ ఇస్తున్నాయి. 2019లో మహీంద్రా భాగస్వామ్యంతో జెక్ బ్రాండ్ జావా దేశీ మార్కెట్లోకి తిరిగి రాగా, గత ఏడాది చేతక్ అల్బిట్ పేరుతో ఎలక్ర్టిక్ వాహన అవతారంలో దర్శనమిచ్చింది. తాజాగా ఎల్ఎంఎల్ బ్రాండ్ భారత టూ వీలర్ మార్కెట్లో తిరిగి గ్రాండ్ ఎంట్రీకి సన్నద్ధమైంది. వెస్పాతో కలిసి ఎల్ఎంఎల్ పలు స్కూటర్లను భారత్లో లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.
చేతక్ తరహాలోనే ఎలక్ట్రిక్ వాహనంతో భారత మార్కెట్లో తిరిగి ఎంట్రీ ఇవ్వాలని ఎల్ఎంఎల్ ప్రణాళికలు రూపొందించుకుంది. ప్రస్తుతానికి ప్రోడక్ట్ వివరాలు, ఎప్పటిలోగా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ చేస్తామనే వివరాలను ఎల్ఎంఎల్ ఇంకా వెల్లడించలేదు.1972లో ఏర్పాటైన దేశీ ఆటోమొబైల్ కంపెనీ ఎల్ఎంఎల్ ఉనికిలోకి రాగా 1983లో 100 సీసీ స్కూటర్ల తయారీ చేపట్టింది.
భారత్ మార్కెట్లోకి తాము తిరిగి ప్రవేశించడం ఉత్సుకత కలిగిస్తోందని, వినూత్న ఉత్పత్తులతో మారుతున్న కస్టమర్ల అభిరుచికి తగినవిధంగా ప్రోడక్ట్ డెవలప్మెంట్ వ్యూహాలపై కసరత్తు సాగిస్తున్నామని ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ఎండీ, సీఈఓ యోగేష్ బాటియా వెల్లడించారు. మార్పును స్వాగతిస్తూ ప్రీమియం ఉత్పత్తులతో ఎగువ మధ్యతరగతి, పట్టణ ప్రాంత జనాభాను ఆకట్టుకునే వాహనాలతో ముందుకొస్తామని పేర్కొన్నారు.