ముంబై, సెప్టెంబర్ 16: ఉత్పాదకతను పెంచుకోవడానికి ఆయా రంగాల్లోని వివిధ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త టెక్నాలజీలవైపు అడుగులేస్తున్న నేపథ్యంలో మెజారిటీ ఉద్యోగులూ కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా పని చేసుకునిపోయేలా ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ప్రస్తుతం 75 శాతానికిపైగా మిల్లేనియల్స్, 74 శాతం జెన్ ‘ఎక్స్’, 70 శాతం జెన్ ‘జెడ్’ నిపుణుల ఆలోచన ఇలాగే ఉందని లింక్డ్ ఇన్ ఇండియా తాజా నివేదిక ఒకటి చెప్తున్నది. తమను నీరసింపజేసే టాస్క్లను ఏఐతో పూర్తి చేసేందుకు అత్యధిక శాతం ఉద్యోగులు ఉవ్విళ్లూరుతున్నట్టు లింకెడిన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీనివల్ల ఉత్సాహంతో కూడిన టాస్క్లపై మరింత సమయాన్ని వెచ్చించవచ్చన్నదే వారి యోచన అని తెలిపింది.
1965-80 మధ్య జన్మించినవారిని జెన్ ‘ఎక్స్’లుగా, 1981-96 మధ్య పుట్టినవారిని మిల్లేనియల్స్గా, 1997-2010 మధ్య జన్మించినవారిని జెన్ ‘జెడ్’లుగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా, ఏఐ రాకతో తమ పని భారం తగ్గుతుందని, దీనివల్ల వ్యక్తిగత జీవితంపై మరింత దృష్టి సారించవచ్చని కూడా మెజారిటీ ఉద్యోగులు అభిప్రాయపడుతుండటం గమనార్హం. మరోవైపు ఏఐకి క్రమేణా పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా ఉద్యోగులంతా టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా వెళ్తున్నారని కూడా ఈ సర్వేలో స్పష్టమైందని లింకెడిన్ ఇండియా ఎడిటోరియల్ లీడ్, కెరియర్ ఎక్స్పర్ట్ నిరాజిత బెనర్జీ అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 23-29 మధ్య ఈ సర్వే జరుగగా, 18 ఏండ్లకు పైబడిన మొత్తం 2,045 మంది ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించారు. దీంతో కృత్రిమ మేధపట్ల భారతీయులు, ఉద్యోగుల్లో కొంత సంశయం కనిపిస్తున్నా.. మెజారిటీ ఉద్యోగులు ఆశాజనకంగానే ఉన్నట్టు తేలిందని లింకెడిన్ చెప్తున్నది.