Starlink | శాటిలైట్ ఉపగ్రహ చానళ్ల లైసెన్స్ కోసం ఎలన్మస్క్ సారధ్యంలోని శాటిలైట్ వెంచర్ స్టార్లింక్ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ లైసెన్స్ మంజూరు చేయడానికి సెక్యూరిటీ పరమైన అంశాలను పరిశీలిస్తున్నామని ఆ వర్గాల కథనం. స్టార్లింక్లో ఎఫ్డీఐ పెట్టుబడులు, ఆర్థిక అంశాలు, షరతులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే స్టార్లింక్ ఓనర్షిప్ `డిక్లరేషన్` పత్రం కూడా ప్రభుత్వ వర్గాలకు అందజేసినట్లు తెలియవచ్చింది.
ఈ నెల 21, 22 తేదీల్లో భారత్లో ఎలన్మస్క్ పర్యటిస్తారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుతోపాటు ఆ కంపెనీ పెట్టుబడి ప్రణాళికల కోసం అందరూ వేచి చూస్తున్నారు. భారత్ మార్కెట్లోకి టెస్లా కార్ల ఎంట్రీ కోసం ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత్లో కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే విదేశీ కంపెనీల కార్ల దిగుమతిపై సుంకాలను తగ్గిస్తామని కేంద్రం తన నూతన ఈవీ పాలసీలో తెలిపింది.
ఇదిలా ఉండగా, గతవారం ఎలన్మస్క్ తన భారత్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ ప్రణాళిక సంగతి `ఎక్స్` ద్వారా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో భేటీ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దేశంలో శాట్కామ్ సర్వీసులు ప్రారంభించేందుకు అనుమతి కోసం మస్క్ సారధ్యంలోని స్టార్లింక్ దరఖాస్తు చేసుకున్నది. 4,000 లో ఆర్బిట్ ఉపగ్రహాలను స్టార్ లింక్ ప్రయోగించింది. స్టార్ లింక్కు లైసెన్స్ మంజూరు చేస్తూ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసు అందరికీ అందుబాటులోకి వస్తుంది.