LIC IPO | ఎట్టకేలకు భారతీయ జీవిత బీమాసంస్థ (ఎల్ఐసీ) ఐపీవోకు ముహూర్తం ఖరారైంది. ఎల్ఐసీ ఐపీవో మార్చి 31వ తేదీ లోపు దేశీయ స్టాక్ మార్కెట్లను తాకనున్నది. ఎల్ఐసీ ఐపీవో ముసాయిదా పత్రాలు ఖరారు చేసే పనిలో ఉన్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే పీటీఐకి చెప్పారు. ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ ఈ ఆర్థిక సంవత్సరంలోనే జరుగుతుందని, అందుకు మార్చి 31లోపు లిస్టవుతుందని తెలిపారు.
మార్చి నెలాఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఎల్ఐసీ ఐపీవో చాలా కీలకం కానున్నది. ఎల్ఐసీ ఐపీవోతోనే పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని కేంద్ర బడ్జెట్ చేరుకోగలదు. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.32,835 కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా కేంద్రం సమకూర్చుకుంది. ఈ ఏడాది బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
రూ.1.75 లక్షల కోట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. లక్ష కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ ద్వారా రూ.75 వేల కోట్లు సేకరించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వివిధ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ.9,330 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎల్ఐసీ లాభాల ద్వారా రూ.1437 కోట్లు కేంద్రానికి వచ్చాయి.