అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సదరు సంస్థ స్పందించింది. పెట్టుబడులు పెట్టేముందు అన్ని చట్టబద్ధమైన విధివిధానాలను అనుసరిస్తామని, నిబంధనలన్నింటినీ పక్కాగా పాటిస్తామని మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం తెలిపింది. అదానీ గ్రూప్ డెట్, ఈక్విటీ సెక్యూరిటీల్లో రూ.35,917.31 కోట్ల పెట్టుబడులు పెట్టామని ఎల్ఐసీ గత వారం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేసిన సంగతి విదితమే. సంస్థ నిర్వహణలో మొత్తం రూ.41.66 లక్షల కోట్ల ఆస్తులుండగా, అందులో ఇవి 0.975 శాతానికి సమానం. మరోవైపు పార్లమెంట్లోనూ అదానీకి ఎస్బీఐ, ఎల్ఐసీ రుణాలు, పెట్టుబడులపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఇదే ప్రధానాంశమంటూ మోదీ సర్కారు తీరును ఎండగడుతున్నాయి.