LIC | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.9,444 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6334 కోట్లతో పోలిస్తే 49 శాతం వృద్ధిని సాధించింది. గత త్రైమాసికంలో ప్రీమియం వసూళ్ల ద్వారా సంస్థకు రూ.1,17,017 కోట్ల ఆదాయం సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ చైర్మన్ సిద్దార్థ మోహంతీ తెలిపారు. క్రితం ఏడాది ఇది రూ.1,11,788 కోట్లుగా ఉన్నది. అలాగే కంపెనీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.4 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. మరోవైపు కంపెనీ అసెట్ అండర్ మేనేజ్మెంట్(నిర్వహణలో ఉన్న ఆస్తి విలువ-ఏయూఎం) రూ.44.34 లక్షల కోట్ల నుంచి రూ.49.66 లక్షల కోట్లకు చేరుకున్నది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో(ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) రూ.3,22,776 కోట్ల ఆదాయంపై రూ. 26,913 కోట్ల లాభాన్ని గడించింది. 58.90 శాతం మార్కెట్ వాటాతో సంస్థ మార్కెట్ లీడర్గా కొనసాగుతున్నది.
దేశీయ అత్యంత విలువైన సంస్థల జాబితాలోకి బీమా దిగ్గజం ఎల్ఐసీ కూడా చేరింది. గత కొన్నిరోజులుగా కంపెనీ షేరు ధర ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటంతో మార్కెట్ విలువ అంతకంతకు పెరుగుతున్నది. దీంట్లోభాగంగానే గురువారం షేరు ధర 6 శాతం లాభపడటంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.6.99 లక్షల కోట్లకు చేరుకున్నది. దేశీయ అత్యంత విలువైన సంస్థల జాబితాలో టాప్-5 స్థానాన్ని దక్కించుకున్నది. ఇంట్రాడేలో 9.51 శాతం లాభపడిన కంపెనీ షేరు చివరకు 5.86 శాతం లాభంతో రూ.1,106.25 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈలోనూ 6.46 శాతం ఎగబాకి రూ.1,112 వద్ద స్థిరపడింది. రూ.1,000 కంటే అధికంగా నమోదవడం ఇదే తొలిసారి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.38,740.62 కోట్లు పెరిగి రూ.6,99, 702.87 కోట్లకు చేరుకున్నది. టాప్-5లో కొనసాగుతున్న ఐసీఐసీఐ బ్యాంక్ను వెనక్కినెట్టి ఈ స్థానాన్ని ఎల్ఐసీ కైవసం చేసుకున్నది. గత నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)ని దాటేసిన ఎల్ఐసీ ఈసారి ఐసీఐసీఐ బ్యాంక్ ర్యాంక్ను అధిగమించింది. మే 2022లో స్టాక్ మార్కెట్లోకి లిైస్టెన ఎల్ఐసీ..సంస్థలో కేంద్రానికి ఉన్న షేర్లలో 22.13 కోట్ల షేర్లు లేదా 3.5 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో విక్రయించింది. ప్రస్తుతం సంస్థలో కేంద్రానికి 96.5 శాతం వాటా ఉన్నది.