LIC | ముంబై, డిసెంబర్ 29: బీమా క్లెయింల పరిష్కారంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అగ్రస్థానంలో ఉంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ 98.5 క్లెయింలను సెటిల్ చేసినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) వెల్లడించింది. అయితే అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఎల్ఐసీ సెటిల్మెంట్ నిష్పత్తి 98.7 శాతం నుంచి స్వల్పంగా తగ్గింది. ఐఆర్డీఏ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ప్రైవేటు జీవితబీమా సంస్థల సెటిల్మెంట్ రేషియో సైతం 98.1 శాతం నుంచి 98 శాతానికి దిగింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్లో 12.5 లక్షల క్లెయింలు రాగా, బీమా కంపెనీలు 12.4 లక్షల క్లెయింలు పరిష్కరించాయి. గ్రూప్ క్లెయింల్లో ఎల్ఐసీ దాదాపు 99 శాతం సెటిల్ చేసింది. ప్రైవేటు సంస్థలు 99.4 శాతం సెటిల్ చేశాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా వ్యాపారంలో సరెండర్లు/విత్డ్రాయిల్స్ 25.6 శాతం పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వీటిలో ఎల్ఐసీ చెల్లించినవే 56.3 శాతం పాలసీలు ఉన్నాయి. మొత్తం జీవిత బీమా పరిశ్రమ పాలసీదార్లకు చెల్లించిన ప్రయోజనాల విలువ రూ. 5 లక్షల కోట్ల వరకూ ఉన్నది. ఇది నికర ప్రీమియం ఆదాయంలో 64 శాతం. వ్యక్తిగత జీవిత బీమా వ్యాపారంలో 10.8 లక్షల డెత్ క్లెయింలు రాగా, కంపెనీలు 10.6 లక్షల క్లెయింలను పరిష్కరించి రూ. 28,611 కోట్లు చెల్లించాయి.