పాలసీదార్లకు రూ. 60 డిస్కౌంట్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెగా పబ్లిక్ ఆఫర్లో జారీచేసే షేరు ధరను నిర్ణయించారు. షేరుకు రూ.902-949 ధరల శ్రేణితో ఐపీవో జారీచేయనున్నట్టు సంబంధిత వర్గాలు మంగళశారం వెల్లడించాయి. ఇష్యూ మే 4న ప్రారంభమై, మే 9న ముగుస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. పాలసీ హోల్డర్లకు రూ. 60, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ. 40 చొప్పున ఇష్యూ ధరలో డిస్కౌంట్ ఉంటుందని వారు వివరించారు. ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను(22.13 కోట్ల షేర్లు) విక్రయించి, రూ. 21,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
పాలసీ హోల్డర్లకు 2.21 కోట్ల షేర్లు (ఇష్యూ పరిమాణంలో 10 శాతం) రిజర్వ్ చేయగా, ఉద్యోగులకు 15 లక్షల షేర్లను కేటాయించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. పాలసీ హోల్డర్లు, ఉద్యోగుల రిజర్వేషన్లు పోగా, మిగిలిన షేర్లలో 50 శాతం సంస్థాగత ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగానికి నిర్దేశించిన కోటాలో 60 శాతం షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. మే 2న యాంకర్ ఇష్యూ ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐపీవో రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి బుధవారంనాటికల్లా సమర్పించే అవకాశం ఉంది.