హైదరాబాద్, ఆగస్టు 31: ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వార్షికోత్సవం సందర్భంగా పాలసీదార్లకు ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి వీలు గా సెప్టెంబర్ 1 నుంచి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు గురువారం సంస్థ తెలిపింది. తమ 67 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాధించిన విజయాల్ని ఎల్ఐసీ ఒక ప్రకటనలో వివరించింది. 1956లో రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ 2023 మార్చి 31నాటికి రూ.43,97,205 కోట్లకు చేరాయి. 8 జోనల్ కార్యాలయాలు, 113 డివిజనల్ కార్యాలయాలు, 74 కస్టమర్ జోన్స్, 2,048 బ్రాంచ్ ఆఫీసులు, 1,580 సెటిలైట్ ఆఫీసులు, 13.47 లక్షల ఏజెంట్లతో పాలసీదార్లకు సేవలు అందిస్తున్నామని ఎల్ఐసీ వివరించింది. బీమా రంగంలోకి ప్రైవేటుకు ద్వారాలు తెరిచి రెండు దశాబ్దాలు గడిచిన తర్వాతకూడా అధికశాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యస్థానంలో కొనసాగుతున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మార్చి 31నాటికి 27.74 కోట్ల పాలసీలకు సేవలందించామని పేర్కొంది.
2022-23లో పనితీరు
ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరును కనపర్చి మార్కెట్ లీడర్గా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు ఎల్ఐసీ తెలిపింది. రూ.2.31.899 కోట్ల తొలి ఏడాది ప్రీమియం సంపాదించామని, 204.65 లక్షల పాలసీలను విక్రయించామని, పాలసీల సంఖ్యలో 71.76 శాతం మార్కెట్ వాటాను, ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఇన్కంలో 62.58 శాతం మార్కెట్ వాటాను సాధించామని వివరించింది. రూ.2,09,938 కోట్ల విలువైన 225.51 లక్షల క్లయింలను సెటిల్ చేశామని, మెచ్యూరిటీ క్లయిమ్స్ పెయిడ్ రేషియో 92.65 శాతం, డెత్ క్లయింల పెయిడ్ రేషియో 98.60 శాతమని ఎల్ఐసీ తెలిపింది. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సమయానుగుణంగా క్లయిమ్ సెటిల్మెంట్స్కు కట్టుబడి ఉన్నట్టు వార్షికోత్సవ సందర్భంగా ఎల్ఐసీ ప్రకటించింది.