న్యూఢిల్లీ, మే 3: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో తీసుకొస్తున్న ఐపీవోకు దేశీ ఫండ్స్ నుంచి భారీ మద్దతు లభించింది. ఐపీవో ప్రారంభతేదీకి ముందుగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,627 కోట్లు సమీకరించినట్టు ఎల్ఐసీ మంగళవారం ప్రకటించింది. మొత్తం ఐపీవోలో 22.13 కోట్ల షేర్లు జారీచేస్తుండగా, ఇందులో 5.93 కోట్ల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు రిజర్వ్చేశారు. ఈ షేర్లకు రూ. 949 ధరతో యాంకర్ ఇన్వెస్టర్లు బిడ్ చేశారని, యాంకర్ ఇష్యూలో రెండొంతులకుపైగా 4.2 కోట్ల (71.12 శాతం) షేర్లను దేశీ మ్యూచువల్ ఫండ్స్కు కేటాయించినట్టు ఎల్ఐసీ…స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.
ఈ ఇష్యూలో 15 మ్యూచువల్ ఫండ్స్కు చెందిన 99 స్కీముల నుంచి పెట్టుబడులు వచ్చాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కొటక్ మహీంద్రా లైఫ్, పీఎన్బీ మెట్లైఫ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ పెన్షన్ స్కీమ్లు యాంకర్ ఇష్యూలో పాలుపంచుకున్నాయి. విదేశాల నుంచి సింగపూర్ ప్రభుత్వం, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, బీఎన్పీ ఇన్వెస్ట్మెంట్లు యాంకర్ ఇష్యూకు బిడ్ చేసినట్టు ఎల్ఐసీ తెలిపింది.
ఎల్ఐసీలో ప్రభుత్వం 3.5 శాతం వాటా విక్రయించేందుకు తీసుకొస్తున్న ఐపీవో మే 4, బుధవారం ప్రారంభంకానుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సంస్థ రూ. 5,600 కోట్లకుపైగా రాబట్టింది. రూ. 902-949 ధరల శ్రేణితో వస్తున్న ఈ ఐపీవోలో పాలసీదారులకు ఈక్విటీ షేరుపై రూ. 60 డిస్కౌంట్ను, రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ. 45 డిస్కౌంట్ను ఎల్ఐసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 17న స్టాక్ ఎక్సేంజీల్లో ఎల్ఐసీ లిస్టవుతుంది.