LIC IPO | దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయిన భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) షేర్లు ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లాయి. అతిపెద్ద ఐపీవోగా భావిస్తూ భారీగా నిధులు పెట్టుబడులు పెట్టినవారి ఆశలకు గండి పడింది. ప్రత్యేకించి లిస్టింగ్ గెయిన్స్పై ఆశలు పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. మంగళవారం స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ఎల్ఐసీ షేర్లు ఐపీవో షేర్ కంటే తక్కువగా ట్రేడ్ కావడమే దీనికి కారణం. ఏ దశలోనూ ఎల్ఐసీ షేర్.. ట్రేడింగ్లో ఐపీవో ఇష్యూ ధరను అందుకోలేదు. ఐపీవోలో ఎల్ఐసీ ఇష్యూ ధర రూ.949గా నిర్ణయించారు. కానీ బీఎస్ఈలో ఎల్ఐసీ షేర్ 8.62 శాతం నష్టంతో రూ.867.20 వద్ద, ఎన్ఎస్ఈలో 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టయింది. చివరకు ఎల్ఐసీ షేర్ 7.75 శాతం నష్టపోయి రూ.875.45 వద్ద ముగిసింది. ఇంట్రా డే ట్రేడింగ్లో ఎల్ఐసీ షేర్ రూ.860.10-920 మధ్య తచ్చాడింది.
ఫలితంగా సాధారణ ఇన్వెస్టర్లు ఒక్కో షేర్పై రూ.77 లిస్టింగ్ నష్టాన్ని చవి చూశారు. రూ.60 రాయితీకి రూ.889 వద్ద షేర్లు దక్కించుకున్న పాలసీదారులు, రూ.45 డిస్కౌంట్తో షేర్లు పొందిన ఎల్ఐసీ ఉద్యోగులు మాత్రం కాసింత నష్టం తగ్గించుకోగలిగారు. ఈ ఐపీవో ద్వారా ప్రభుత్వం రూ.20,557 కోట్ల నిధులు సేకరించింది. రూ.949లకు ఎల్ఐసీ ఇష్యూ ధరతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6 లక్షల కోట్లుగా నమోదైంది. అయితే, నష్టాలతో లిస్ట్ కావడంతో దాని ఎం-క్యాప్ రూ.5.54 లక్షల కోట్లకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు రూ.42,500 కోట్లు నష్టపోయారు. ఎల్ఐసీ ఐపీవో సబ్స్క్రిప్షన్లో మూడు రెట్లు స్పందన లభించినా.. లిస్టింగ్లో నష్టాలను చవి చూసింది.
ఐపీవో ద్వారా ఎల్ఐసీ ఐదో అతిపెద్ద కంపెనీ (ఎం-క్యాప్ రూ.5.57 లక్షల కోట్లు)గా అవతరించింది. రూ.5.27 లక్షల కోట్ల విలువ గల హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.4.94 లక్షలకోట్లు), ఎస్బీఐ (రూ.4.14 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ (రూ.3.97 లక్షల కోట్లు) కంటే ఎల్ఐసీ పెద్ద కంపెనీ. మార్కెట్ లీడర్గా ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17.12 లక్షల కోట్లు. స్టాక్ మార్కెట్లో అనూహ్య పరిస్థితుల్లోనే ఎల్ఐసీ షేర్లు తక్కువ ధరకు లిస్టయ్యాయని దీపం కార్యదర్శి తుహిన్ కాంత పాండే చెప్పారు. ఎల్ఐసీ చైర్మన్ ఎమ్మార్ కుమార్ మాట్లాడుతూ మున్ముందు ఎల్ఐసీ షేర్లకు డిమాండ్ పెరుగుతుందన్నారు.