న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఎల్ఐసీ ఐపీవో ద్వారా సమీకరించాలనుకున్న నిధుల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించుకుంది. ఎల్ఐసీ ఐపీవోలో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) విక్రయించి రూ.30 వేల కోట్లు సేకరించాలని ప్రస్తుతం ప్రభుత్వం యోచిస్తున్నది. గతంలో నిర్దేశించుకున్న ఈ లక్ష్యాన్ని సగానికి తగ్గించుకున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇంతే శాతం వాటాకు దాదాపు రూ. 60,000 కోట్లకుపైగా నిధుల్ని ఇంతకుముందు ప్రభుత్వం ఆశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్ పరిస్థితులు మారడం, ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లడంతో కంపెనీ విలువను తగ్గించాల్సి వస్తున్నదని, దీంతో ఐపీవో విలువ, ఆఫర్ ధర తగ్గుతుందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఎల్ఐసీకి ప్రస్తుతం రూ. 6 లక్షల కోట్ల విలువను ఆపాదించి, ఇష్యూ జారీచేయాలని యోచిస్తున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ వాల్యుయర్లు నిర్దేశించిన రూ.5.4 లక్షల కోట్ల ఎంబడెడ్ విలువకు 2-3 రెట్లు అధికంగా దాదాపు రూ. 12-16 లక్షల కోట్ల మార్కెట్ విలువను సంస్థకు ఆపాదించి, ఐపీవోను తేవాలని మార్చిలో ప్రతిపాదించారు. ఇప్పుడు రూ. 30 వేల కోట్ల విలువతో జారీచేసినా, దేశంలో ఎల్ఐసీ ఆఫరే అతిపెద్దది కానుంది. ఇప్పటివరకూ ఆ రికార్డు 97 కమ్యూనికేషన్ (పేటీఎం) జారీచేసిన రూ. 18,300 కోట్ల ఐపీవోదే.
ఆఫర్ సమయంపై త్వరలో నిర్ణయం
సెబీ ఈ ఫిబ్రవరిలో ఇచ్చిన అనుమతి ప్రకారం ఎల్ఐసీ ఐపీవోను తీసుకొచ్చేందుకు మే 12 వరకూ ప్రభుత్వానికి గడువు ఉన్నది. ఆ తేదీ దాటితే మళ్లీ ఆఫర్ డాక్యుమెంట్లను సమర్పించి, తిరిగి అనుమతి పొందాల్సిందే. ఈ నేపథ్యంలో ఆఫర్ జారీచేసే సమయంపై ప్రభుత్వం వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఐపీవోను ఇప్పుడు జారీచేయకపోతే, ఆగస్టు-సెప్టెంబర్ వరకూ వాయిదా పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మే 12కల్లా ఆఫర్ను తేవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటే, ఇష్యూ ధర తదితర వివరాలతో రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ను ఈ వారంలో సెబీకి ఫైల్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూను మార్చి నెలలోనే తెచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధమయ్యింది. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడితో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావడం, ముడి చమురు ధరలతో ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి పరిణామాలతో విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లో వరుస విక్రయాలకు తెరతీసారు. దీంతో ఎల్ఐసీ ఆఫర్ ఎప్పటికప్పుడు జాప్యమవుతున్నది.