న్యూఢిల్లీ, జనవరి 13: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న ప్రభుత్వ రంగ జీవితబీమా దిగ్గజం ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ ఏడాది మార్చికల్లా జారీకానున్నది. ముసాయిదా ప్రాస్పెక్టస్ పత్రాల్ని త్వరలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. 2021 సెప్టెంబర్ త్రైమాసికానికి ఎల్ఐసీ ఆర్థిక ఫలితాలు రూపొందుతున్నాయని, ఈ నెలాకరులో లేదా ఫిబ్రవరి తొలివారంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేస్తామని ఆ అధికారి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఆఫర్ మార్కెట్లోకి రావడం ఖాయమన్నారు. గతవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సీనియర్ అధికారులతో సమావేశమై ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్పై జరుగుతున్న కసరత్తును సమీక్షించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించిన రూ. 1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్మెంట్ లక్ష్య సాధనకు ఎల్ఐసీ ఐపీవో కీలకం కానున్నది. ఈ ఆఫర్ కోసం ప్రభుత్వం ఇప్పటికే 10 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థల్ని నియమించింది.