అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో త్వరలో ప్రారంభం అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మంగళవారం పార్లమెంట్లో 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తూ ఈ సంగతి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ లక్ష్యాల సాధనలో ఎల్ఐసీ ఐపీవో కీలకం కానున్నది.
తమ ప్రభుత్వం.. నూతన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్ఈ) విధానం అమలు దిశగా వెళుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇప్పటికే వ్యూహాత్మక ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) వెల్లడిస్తున్న గణాంకాల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.9,329.9 కోట్లు, డివిడెండ్ల ద్వారా రూ.35,116.72 కోట్ల నిధులు వచ్చాయి.
యాక్సిస్ బ్యాంక్లో సెసిఫైడ్ అండర్టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్యూయూటీఐ)లో వాటాల ఉపసంహరణతో రూ. 9,329.9 కోట్లు, యాక్సిస్ బ్యాంక్లో వాటా విక్రయంతో రూ.3,994.33 కోట్లు, ఎన్ఎండీసీ ఓఎఫ్ఎస్ ద్వారా రూ. 3,651.37 కోట్ల నిధులు వచ్చాయి.
ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులను అనుమతించాలని కోరుతూ సంస్థ చట్టంలో సవరణలపై వచ్చే వారం కేంద్ర క్యాబినెట్ ముందుకు బిల్లు వస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నెల మధ్యలో ఎల్ఐసీ చట్ట సవరణ బిల్లుపై తుది ప్రతిపాదనలు కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి వెళతాయని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఐసీ మినహా బీమా రంగంలో 74 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంది. ప్రస్తుతం ఎల్ఐసీలో 20 శాతం విదేశీ పెట్టుబడులను కేంద్రం అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.