న్యూఢిల్లీ, మే 28: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ..ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నది. ఈ విషయాన్ని కంపెనీ చైర్మన్ సిద్దార్థ మోహంతీ సూచనప్రాయంగా వెల్లడించారు. బీమా రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, దీంట్లోభాగంగానే ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఇందుకోసం బీమా చట్టం సవరించడం ద్వారా కంపొజిట్ లైసెన్స్ను అనుమతించే అవకాశాలున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ మార్గదర్శకాలకు లోబడి బీమా చట్టం-1938 ప్రకారం ప్రస్తుతం లైఫ్, జనరల్ లేదా ఆరోగ్య బీమా సేవలు అందించడానికి సంస్థలకు వీలులేదు. కానీ, బీమా చట్టాన్ని సవరించే ప్రతిపాదనను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీంట్లోభాగంగానే ఒకే సంస్థకు అన్ని రకాల సేవలు అందించడానికి వీలుపడనున్నది.
దీనిపై ఆయన మాట్లాడుతూ..ఆరోగ్య బీమా రంగంలోకి వచ్చే దానిపై అంతర్గతంగా పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఒకే సంస్థకు లైఫ్, జనరల్ లేదా హెల్త్ బీమా సేవలు అందించడానికి అవసరమైన లైసెన్స్లు మంజూరు చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించిన విషయం తెలిసిందే.
ఇందుకోసం బీమా చట్టాల్లో మార్పులు చేయాలని సూచించింది. ఒకేతాటిపైకి అన్ని రకాల బీమా సేవలు అం దించడంతో పాలసీదారుడికి ఆర్థిక ప్రయోజనాలు కలగడంతోపాటు సమయం ఆదాకానున్నది. సింగిల్ పాలసీతో లైఫ్, హెల్త్, పొదుపు సేవలు అందించడానికి వీలు పడనున్నదని కమిటీ సూచించింది.