LIC-Fin Tech | ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. యుటిలిటీ బిల్లుల నుంచి రుణ బకాయిల వరకూ అన్నీ ఆన్ లైన్ లావాదేవీలే.. డిజిటలైజేషన్ తర్వాత ఫిన్ టెక్ సంస్థలు వచ్చాయి. అదే బాటలో దేశీయ బీమా రంగ దిగ్గజం- భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. డిజిటల్ ఫైనాన్స్ రంగంలోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. కొత్త ఫిన్ టెక్ సంస్థ డెవలప్మెంట్ అవకాశాలను పరిశీలిస్తున్నామన్న మొహంతి.. అది ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నందున ఆ వివరాలేమీ చెప్పలేమని పేర్కొన్నారు. అందులో భాగంగా సంస్థను పూర్తిగా డిజిటలైజేషన్ చేసేందుకు ‘డిజిటల్ ఆవిష్కరణ మరియు విలువ వృద్ధి (DIVE – Digital Innovation and Value Enhancement)’ ప్రాజెక్టును అమలులోకి తేనున్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి తెలిపారు. ఇందుకోసం ఒక కన్సల్టెన్సీ సంస్థను నియమించామన్నారు.
‘మా కస్టమర్లు, మధ్యవర్తులు, మార్కెటింగ్ ప్రతినిధులు, స్టేక్ హోల్డర్లు అందరూ ‘డైవ్ (DIVE)’ ద్వారా డివజిటల్ లావాదేవీల్లోకి అడుగు పెట్టాల్సిందే’ అని సిద్ధార్థ్ మొహంతి తెలిపారు. తొలి దశలో డిజిటలైజేషన్ ద్వారా కొత్త పాలసీదారులను చేర్చుకుంటామన్నారు. ప్రస్తుతం ఏజెంట్లు, బ్యాంకులు, ప్రత్యక్ష విక్రయాలతో కొత్త ఖాతాదారులను జత చేసుకుంటున్నట్లు చెప్పారు. ‘క్లయిమ్ సెటిల్మెంట్ రేషియో’, రుణాలు, ఇతర సర్వీసుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. ఇంటి దగ్గర నుంచే కస్టమర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా సర్వీసులు పొందేలా విధి విధానాల్లో మార్పులు చేర్పులూ చేస్తున్నట్లు తెలిపారు.