ముంబై, సెప్టెంబర్ 6: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆఫ్ ఇండియా ఓ సరికొత్త పెన్షన్ ప్లస్ ప్లాన్ను పరిచయం చేసింది. ఇదో నాన్-పార్టిసిపేటింగ్, యూనిట్ లింక్డ్, వ్యక్తిగత పెన్షన్ ప్లాన్. పాలసీదారుడికి క్రమబద్ధమైన, క్రమశిక్షణతో కూడిన పొదుపును అలవర్చడంలో ఈ ప్లాన్ దోహదపడగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఎల్ఐసీ వ్యక్తం చేసింది. ఇదిలావుంటే అమల్లో ఉన్న విధానం ప్రకారం ఈ ప్లాన్లో ఏక వార్షిక ప్రీమియం శాతంగా గ్యారంటీడ్ అడిషన్స్ (ఎల్ఐసీ అందించే అదనపు మొత్తం) చెల్లింపులుంటాయి. రెగ్యులర్ ప్రీమియం శ్రేణులపై 5-15.5 శాతంగా, సింగిల్ ప్రీమియం చెల్లింపులపై 5 శాతం వరకు ఉంటుంది. ఎంచుకున్న ఫండ్నుబట్టి ఈ సొమ్మును యూనిట్ల కొనుగోలుకు పాలసీదారులు వినియోగించవచ్చు. నాలుగు రకాల నిధుల్లో పాలసీదారులు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇందుకుగాను చెల్లించే ప్రతీ ప్రీమియంపై చార్జీలుంటాయి.
వచ్చే నెల ఐడీబీఐ ప్రైవేట్పరం
ఐడీబీఐ బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీ కలిసి 60 శాతం వాటాను అమ్మే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కోసం అక్టోబర్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) రావచ్చని ఓ ప్రముఖ జాతీయ వార్తా సంస్థ మంగళవారం తెలిపింది. ఆర్బీఐ అనుమతులు వస్తే ఈ ఇష్యూ వేగం అందుకోనున్నది. కాగా, జూన్ ఆఖరు నాటికి ఐడీబీఐలో కేంద్రం, ఎల్ఐసీలకు కలిపి 94 శాతానికిపైగానే వాటా ఉన్నది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 45.48 శాతంగా ఉంటే, ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉన్నది. ఈ క్రమంలోనే 60 శాతం అమ్మేయాలని ఇరు వర్గాలు చూస్తున్నాయి. గత ఏడాది ఐడీబీఐ బ్యాంక్ను ప్రైవేటీకరించాలని మోదీ సర్కారు నిర్ణయించినది తెలిసిందే. దీంతో ఎల్ఐసీతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.
పాలసీ వివరాలు
కాలవ్యవధి పూర్తయిన తర్వాత యాన్యుటీ ప్లాన్ ద్వారా రెగ్యులర్ ఇన్కంలోకీ మార్చుకునే సౌకర్యం.
ఈ ప్లాన్ను సింగిల్ ప్రీమియం పేమెంట్ పాలసీగానైనా, రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ పాలసీగానైనా కొనవచ్చు.
రెగ్యులర్ పేమెంట్ విధానం కింద పాలసీ వ్యవధిలో ప్రీమియంలను చెల్లించుకోవచ్చు.
ప్రీమియం మొత్తాలను పాలసీదారులే ఎంచుకోవచ్చు.
ప్రీమియంల కనీస, గరిష్ఠ పరిమితులపై పాలసీ కాలవ్యవధి ఆధారం.
కొన్ని షరతులకు లోబడి పాలసీదారులు ప్రీమియంల చెల్లింపు కాలవ్యవధిని పొడిగించుకోవచ్చు.