మరో రెండ్రోజుల తర్వాత ఇతర పబ్లిక్ ఇన్వెస్టర్లకు ఆఫర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ఎల్ఐసీ మెగా ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ఆఫర్ మార్చి 11న మొదలవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇతర పబ్లిక్ ఇన్వెస్టర్లకు మరో రెండ్రోజుల తర్వాత ఇష్యూ ప్రారంభమవుతుందని ఆ వర్గాల్ని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈ టైమ్ షెడ్యూల్ మారే అవకాశం కూడా లేకపోలేదని ఆ వర్గాలు వివరించాయి. కాగా మార్చి తొలివారంలో ఎల్ఐసీ ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. అటుతర్వాత ఆఫర్ ధరల శ్రేణిని నిర్ణయించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎల్ఐసీ నిరాకరించింది. ఈ సమాచారంపై ఆర్థిక శాఖ ప్రతినిధుల స్పందన లభించలేదు.