Gold Price | ఎప్పుడూ పండుగ సీజన్లో అధిక ధర పలికే బంగారం ఈ దఫా అంతర్జాతీయ పరిణామాల కారణంగా రోజురోజుకూ తగ్గిపోతున్నది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం తులం ధర రూ. 58,200 స్థాయికి దిగివచ్చింది. అలాగే దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సేంజ్లో శుక్రవారం గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టు రూ. 57,096 స్థాయికి, ప్రపంచ మార్కెట్లో స్పాట్ బంగారం ఔన్సు ధర 1,848 వద్ద ముగిసింది. ఇది రెండు నెలల నెలల కనిష్ఠస్థాయి.
ఎందుకీ తగ్గుదల..
డాలర్ ఇండెక్స్ అదే పనిగా పెరుగుతూ 10 నెలల గరిష్ఠస్థాయికి చేరడం, అమెరికాలో అధిక వడ్డీ రేట్లు దీర్ఘకాలం కొనసాగుతాయన్న భయాలతో ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆక్మే ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుగంధ సచ్దేవా వివరించారు. అంతర్జాతీయ ట్రెండ్ను అనుసరిస్తూ భారత్లో సైతం పుత్తడి ధర క్షీణిస్తున్నది.
పెరిగేదెప్పుడు వచ్చే కొద్దిరోజుల్లో బంగారం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ హెడ్ అనూజ్గుప్తా చెప్పారు. యూఎస్ గవర్నమెంట్ పాక్షికంగా షట్డవున్ అయితే బంగారం ధర భారీగా పుంజుకుంటుందన్నారు. అలాగే చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం ముదిరితే, రియల్టీ నుంచి పెట్టుబడులు సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే పుత్తడిలోకి మళ్లుతాయని, దీంతో ధర పెరుగుతుందన్నారు.
ఏమి చేయాలి..
ఇలా తగ్గుతూ ఉంటే ఇప్పుడే కొనాలా లేక మరికొద్ది రోజులు ఆగి చూడాలా అనే సందేహం పుత్తడి ప్రియుల్లో తలెత్తడం సహజం. ఈ విషయమై సచ్దేవా స్పందిస్తూ బంగారం మదుపరులు వివిధ ఆర్థిక గణాంకాలు, ద్రవ్య విధానాల్ని జాగ్రత్తగా గమనించాలని, ధర ఒక స్థాయి సమీపంలో కుదుటపడిన తర్వాత పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవాలని సూచించారు. సాంకేతికంగా చూస్తే ఔన్సు బంగారం ధరకు తదుపరి మద్దతు 1,810 నుంచి 1,800 డాలర్ల సమీపంలో మద్దతు ఉన్నదని, 1,880 దాటితేనే తిరిగి పెరిగే ఛాన్స్ ఉంటుందన్నారు. ఇక దేశీయంగా ఎంసీఎక్స్లో 10 గ్రాముల పుత్తడికి రూ.57,000 స్థాయి కీలకమైన మద్దతు అని, ఈ దిగువన ముగిస్తే 56,100 వరకూ తగ్గవచ్చని అంచనా వేశారు.