NSC for Tax Savings | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది. మరో 10 రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కానున్నది. ప్రతి వేతన జీవి ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నప్పుడు పన్ను మినహాయింపు క్లయిమ్ చేయాలంటే.. ఈ నెలాఖరులోపే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పన్ను ఆదా చేయడంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్లో మెరుగైన రిటర్న్స్ రావాలంటే.. పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)లో పొదుపు చేయడం బెటర్. ప్రస్తుతం నేషనల్ సేవింగ్స్ సర్టిపికెట్లో పెట్టుబడులపై ఏడు శాతం వడ్డీరేటు లభిస్తున్నది. అంతేకాదు ‘ఎన్ఎస్సీ’లో పెట్టుబడులపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్సీలో పెట్టుబడులపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు.
పిల్లల పేరుపై కూడా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) కింద ఖాతా తెరిచి నిధులు పొదుపు చేయొచ్చు. పిల్లలు పదేండ్ల లోపు వారైతే ఆ చిన్నారి పేరుపై తల్లిదండ్రులు ఖాతా తెరవచ్చు. పదేండ్ల తర్వాత సదరు పిల్లలు సొంతంగా ఆ ఖాతా ఆపరేట్ చేయొచ్చు. వయోజనులైన తర్వాత ఆ ఖాతాపై పూర్తి బాధ్యత వహిస్తారు. 18 ఏండ్లు దాటిన వ్యక్తి.. తాను వ్యక్తిగతంగా గానీ, మైనర్ పిల్లల పేరిట కానీ ఖాతా తెరవచ్చు. ముగ్గురు వయోజనుల పేరుతో ఉమ్మడి ఖాతా కూడా ప్రారంభించవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్కు ఐదేండ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ మీరు మీ పెట్టుబడులు విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఐదేండ్ల వరకు వేచి ఉండాల్సిందే. ఐదేండ్ల లాక్ ఇన్ పీరియడ్ నేపథ్యంలో మెచ్యూరిటీ గడువు రాకముందే మీరు నగదు విత్డ్రా చేయలేరు. వార్షిక ప్రాతిపదికన వడ్డీ పొందొచ్చు. రూల్-72 ప్రకారం 122 నెలలు ఈ పథకంలో పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. మెచ్యూరిటీ పీరియడ్ మధ్య కాలంలో మీరు వడ్డీ ఆదాయం విత్డ్రా చేసుకోవాలనుకున్నా.. అలా చేయలేరు. ఒకటి, రెండేండ్ల గడువులోపు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)లో పెట్టుబడులు సూటబుల్ కాదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.