న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఈ ఏడాది దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు గిరాకీ బాగా ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. హైదరాబాద్సహా ఏడు ప్రధాన నగరాల రియల్టీపై గురువారం స్పందించింది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణె నగరాల్లో గత ఏడాది 2,15,621 యూనిట్ల విక్రయాలు జరిగాయని జేఎల్ఎల్ వివరించింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది అంతకంటే 20 శాతం పెరుగుతాయని, సుమారు 2.6 లక్షల యూనిట్ల అమ్మకాలకు వీలుందని అంచనా వేసింది. ఇదే జరిగితే 2008 నుంచి ఇది అత్యధికమని స్పష్టం చేసింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో (జనవరి-సెప్టెంబర్) 1,96,227 యూనిట్ల సేల్స్ నమోదయ్యాయని జేఎల్ఎల్ వెల్లడించింది. నిరుడు ఇదే సమయంలో అమ్మకాలు 1,61,575 యూనిట్లకే పరిమితమయ్యాయని పేర్కొన్నది.
వచ్చే ఏడాది 3 లక్షలకు..
వచ్చే ఏడాది ఈ 7 దేశీయ ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్ విక్రయాలు దాదాపు 2.9 లక్షల నుంచి 3 లక్షల యూనిట్లుగా ఉండే వీలుందని ఈ సందర్భంగా జేఎల్ఎల్ అభిప్రాయపడింది. నాణ్యమైన ప్రాజెక్టులు, మార్కెట్లో డిమాండ్ దృష్ట్యా 2024లో రెసిడెన్షియల్ సేల్స్ ఆకర్షణీయంగా నమోదవుతాయన్న అంచనాను వ్యక్తం చేసింది. ఇండిపెండెంట్ హౌజ్లు, విల్లాలు, ప్లాటెడ్ డెవలప్మెంట్లనూ కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందన్నది. హోమ్ లోన్ల వడ్డీరేట్లు పెరిగినా, అంతర్జాతీయ స్థాయిలో మందగమనం ఛాయలు కనిపించినా.. దేశీయ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈ ఏడాది స్థితిస్థాపకతను ప్రదర్శించినట్టు రియల్టీ సంస్థ బీసీడీ గ్రూప్ ఎండీ అంగద్ బేడీ విశ్లేషించారు.
గృహ రుణాలపై వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నా, ఇండ్ల ధరలు పెరుగుతూపోతున్నా.. దేశీయ హౌజింగ్ మార్కెట్లో డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అంతా ఇండ్లను కొనేందుకే మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది రెసిడెన్షియల్ సేల్స్ 2.6 లక్షల యూనిట్లుగా ఉండొచ్చు. కొత్త యూనిట్ల ప్రారంభాలు 2.8 లక్షలను తాకవచ్చు.
-శమంతక్ దాస్, జేఎల్ఎల్ ఇండియా రిసెర్చ్ అధిపతి
దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్మాణ రంగం ఆకర్షణీయ వృద్ధిని కనబరుస్తున్నది. నివాస గృహాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నది. మధ్య, ఎగువ శ్రేణి ఇండ్లకు గిరాకీ బాగా ఉండగా, లగ్జరీ యూనిట్లకూ ఆదరణ పెరుగుతుండటం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. మున్ముందూ ఇదే రకమైన డిమాండ్ను అంచనా వేస్తున్నాం.
-ప్రదీప్ అగర్వాల్, సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్
గతకొద్ది సంవత్సరాలుగా భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్నది. ఇందుకు తగ్గట్టే రెగ్యులేటరీ మార్పులూ వస్తున్నాయి. మరోవైపు ఇటు సప్లయర్స్, అటు కన్జ్యూమర్స్ ఆలోచనా ధోరణిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ముఖ్యంగా కస్టమర్ల అభిరుచికి డెవలపర్లు పెద్దపీట వేస్తూ ముందుకెళ్తున్నారు.
-అఖిల్ సరఫ్, రెలాయ్ వ్యవస్థాపకుడు