న్యూఢిల్లీ/ ముంబై: దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ.. తన ఖాతాదారుల కోసం.. ఆరోగ్యం హెల్త్కేర్ బిజినెస్ లోన్ ప్రారంభించింది. దేశంలో పర్యావరణ హిత హెల్త్ కేర్ సిస్టమ్కు మద్దతుగా దీన్ని డిజైన్ చేసింది ఎస్బీఐ.
తన ఖాతాదారులకు టర్మ్ రుణం.. బ్యాంక్ గ్యారంటీ అండ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో క్యాష్ క్రెడిట్ ఇస్తుంది. దీని కింద కనిష్టంగా రూ.10 లక్షల వరకు, గరిష్ఠంగా రూ.100 కోట్ల వరకు రుణం తీసుకోవచ్చు. దీన్ని పదేండ్ల గడువులోపు తీర్చాల్సి ఉంటుంది. నూతన ఫెసిలిటీ ఏర్పాటు, హెల్త్కేర్ వసతుల విస్తరణకు ఈ రుణాన్ని ఖర్చు చేయొచ్చు.
ఈ రుణ పరపతి స్కీమ్ను ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖరా ప్రారంభించారు. దేశంలోని హెల్త్కేర్ రంగానికి మద్దతుగా దీన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీని కింద దవాఖానలు, నర్సింగ్ హోంలు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, పాథాలజీ ల్యాబ్స్, సప్లయర్స్, దిగుమతి దారులు, లాజిస్టిక్ కంపెనీలు రుణాలు తీసుకోవచ్చు.
చిన్న పట్టణాల్లో, పెద్ద నగరాల్లోనూ కనీస స్థాయిలో రూ.10 లక్షల రుణం తీసుకోవచ్చు. పెద్ద నగరాల్లో గరిష్ఠంగా రూ.100 కోట్ల వరకు రుణాలిస్తుంది.
ఈ పథకం కింద దవాఖానల యూనిట్లు గానీ, కంపెనీలు గానీ రూ.2 కోట్ల రుణం వరకు గ్యారంటీ గానీ సెక్యూరిటీ గాని అందించాల్సిన అవసరం లేదు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు గ్యారంటీ స్కీం ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీటీఎంఎస్ఈ) కింద ఈ రుణాలు కవర్ అవుతాయి.
ఏడాది కాలంగా దేశీయంగా హెల్త్కేర్ వ్యవస్థ నిరంతరాయంగా మనకు మద్దతు తెలుపుతున్నదని దినేశ్ ఖరా చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకే ఈ రుణ పరపతి అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక రుణ ప్రొడక్ట్, అవసరమైన కంపెనీలకు సాయ పడుతుందన్నారు దినేశ్ ఖరా. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్యం హెల్త్కేర్ బిజినెస్ లోన్ కింద ఈ రుణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
హెల్త్కేర్ రంగానికి బిజినెస్ లోన్ మాదిరిగానే కరోనా బారిన పడ్డ రోగులకు రూ.5 లక్షల వరకు పర్సనల్ లోన్ ఇస్తున్నట్లు ఎస్బీఐ ఇంతకుముందు ప్రకటించింది. దీనిపై 8.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఐదేండ్ల గడువులోగా దీన్ని తీర్చాల్సి ఉంటుంది.