న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. భారత్లో ఐఫోన్ 13 ఉత్పత్తిని ప్రారంభించింది. చెన్నై సమీపంలోని ఫాక్స్కాన్కు చెందిన ప్లాంట్లో ఐఫోన్ 13ను తయారు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. యాపిల్ కాంట్రాక్ట్ తయారీ భాగస్వామిగా ఫాక్స్కాన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘భారత్లో ఐఫోన్ 13 తయారీ మొదలైనందుకు మేము సంతోషిస్తున్నాము. ఆకర్షణీయమైన డిజైన్, మరింత స్పష్టత కలిగిన ఫొటోలు, వీడియోల కోసం అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్స్, అద్భుతమైన పనితీరును కనబర్చే ఏ15 బయోనిక్ చిప్, సుదీర్ఘ బ్యాటరీ సామర్థ్యం, అడ్వాన్స్డ్ 5జీ అనుభవం.. ఇక్కడి కస్టమర్లను విశేషంగా ఆకట్టుకోగలవు’ అని ఈ సందర్భంగా యాపిల్ ఓ ప్రకటనలో ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కాగా, 2017లో ఐఫోన్ ఎస్ఈతో భారత్లో ఐఫోన్ల తయారీని యాపిల్ సంస్థ మొదలు పెట్టింది. ప్రస్తుతం ఐఫోన్ 11, 12 తయారవుతున్నాయి. ఇప్పుడు ఐఫోన్ 13 కూడా ఈ జాబితాలోకి చేరింది. దేశీయ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులు గడిచిన 20 ఏండ్లకుపైగా అమ్ముడవుతున్నాయి. 2020 సెప్టెంబర్లో ఆన్లైన్ స్టోర్నూ తెరిచింది.