హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): దేశాన్ని సూపర్ పవర్గా మార్చాలంటే మనం ‘3ఐ’ మంత్రమైన ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్లపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. గతంలో ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ అడిగినప్పుడు తాను ఇలాగే చెప్పినట్టు గుర్తుచేశారు. బుధవారం ఇక్కడ జరిగిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కన్సార్టియం ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ఐ కన్సార్టియం లోగోను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో భవిష్యత్తు తరాలకు ఆవిష్కరణలు చేసే అనుకూల వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్ నిలబడాలంటే ‘3ఐ’ మంత్రాన్ని పాటించాలన్నారు. వ్యాపార నిర్వహణకు తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉన్నదన్న మంత్రి.. ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ ఆలోచిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడి ఇలాగే ఆలోచించాలని చెప్పేవారని స్మరించుకున్నారు.
అమెరికాలో విశాలమైన రహదారులుండటం.. అది ధనిక దేశం అయినందువల్ల కాదని, అక్కడి ప్రభుత్వాలు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం వల్లేనని వివరించారు. కాబట్టి మౌలిక వసతుల కల్పన విషయంలో రాజీ పడకూడదని, తెలంగాణ ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఇక రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు చాలా కచ్చితమైన పద్ధతులను పాటిస్తున్నామని, నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను కాపాడలేకపోతే ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని సర్పంచ్లు, కౌన్సిలర్లు, పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం చెప్పిందన్నారు. అందుకే జాతీయ స్థాయిలో 32 అవార్డులు తెలంగాణ రాష్ర్టానికి వచ్చాయన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో సత్వర అనుమతుల జారీకి టీఎస్ ఐపాస్ పాలసీని అమలు చేస్తున్నామని, ఇది విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీపీపీ మహేందర్రెడ్డి, బ్లూక్రాస్ హైదరాబాద్ వ్యవస్థాపకురాలు, నటి అక్కినేని అమల, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం ప్రతినిధులు మమత మాదిరెడ్డి, రాజేష్ బాలరాజు, రవి తంగిరాల, సుబ్బ పేరేప, రమేష్ కాజా తదితరులు పాల్గొన్నారు.
‘రాష్ట్రంలో కొత్త కంపెనీల ఏర్పాటుకు, సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం. బీఎఫ్ఎస్ఐ కంపెనీలకు ప్రధాన గమ్యస్థానంగా తెలంగాణ ఆవిర్భవిస్తున్నది. విద్యా సంస్థలతో కలిసి బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం ముందుకెళ్తే మరింత నైపుణ్యం, ప్రతిభ కలిగిన ఉద్యోగుల్ని ఈ రంగానికి అందించవచ్చు’
-కే తారక రామారావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి