Stock Market | గత వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో అదరగొట్టాయి. మదుపరులు పెట్టుబడులకు పెద్దపీట వేశారు మరి. అయితే ఈ వారం లాభాల స్వీకరణకు వీలుందన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీంతో లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ సూచీల్లో ఒకింత అమ్మకాల ఒత్తిడి నెలకొనవచ్చనిపిస్తున్నది.
అలాగే చిన్న షేర్లు ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా కృత్రిమంగా పెరిగిపోతున్నాయని, దీనిని అరికట్టాల్సిందేనంటూ సెబీ చేసిన హెచ్చరికల ప్రభావం స్టాక్ మార్కెట్లపై కొంత మేరకు పడవచ్చు. ఇక గతవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 22,513.70 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రధాన షేర్లన్నీ ఆకట్టుకోవడం కలిసొచ్చింది. కాగా, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, వివిధ అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్ తీరును నిర్దేశించనున్నాయి.
నిఫ్టీకి 22,500 పాయింట్ల స్థాయి కీలకమైనదని, దీన్ని వదులుకోకుండా బుల్స్ ప్రయత్నిస్తుండగా, ఆ స్థాయి దిగువకు దించేందుకు బేర్స్ పట్టుబడుతున్నట్టు సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ విశ్లేషించారు. నిఫ్టీ 22,000 దిగువన ముగిస్తే 21,800 మద్దతుస్థాయి ముఖ్యమని, ఆ దిగువన 21,700 వరకూ తగ్గవచ్చని జిమిత్ అంచనా వేశారు. రానున్న రోజుల్లో 22,750 స్థాయి గట్టిగా నిరోధించవచ్చన్న అంచనాలున్నాయి.