మార్కెట్పల్స్
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్నాయి. ఆటుపోట్ల నడుమ మదుపరులు పెట్టుబడులకే మొగ్గారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,404.45 పాయింట్లు ఎగబాకి 75,410.39 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 455.10 పాయింట్లు అందుకుని 22,957.10 దగ్గర నిలిచింది. ఈ క్రమంలో సూచీలు దాదాపు ఆల్టైమ్ హైల్లో ఉన్నందున ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ దిశగా అడుగులు వేసేందుకు ఆస్కారమున్నది.
ఇప్పటిదాకా వచ్చిన లాభాలను ఒడిసి పట్టుకునేందుకు ఈ వారం అమ్మకాలకు దిగవచ్చన్న అంచనాలు మెజారిటీ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సరళి.. మార్కెట్ ట్రేడింగ్ను ఇతర అంశాల కంటే ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు. ఫలితంగా కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు వేచిచూసే ధోరణిని అవలంభించవచ్చు. అయినప్పటికీ ఆయా రంగాల షేర్లలో పెట్టుబడులకూ దిగే వీలున్నదని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు ఎప్పట్లాగే ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 22,700 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,500 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 23,300-23,500 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.