FASTag – E-KYC | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. సొంతూరుకు వెళ్లాలన్నా, బంధు మిత్రుల ఇండ్లలో శుభకార్యాలకు హాజరు కావాలన్నా జాతీయ రహదారులపై వెళుతుంటారు. జాతీయ రహదారుల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణకు వాహనదారుల నుంచే కేంద్ర ప్రభుత్వం టోల్ ఫీజు వసూలు చేస్తోంది. టోల్ గేట్ల నగదు చెల్లింపులతో ట్రాఫిక్ జామ్ సమస్యగా మారింది. దీనికి తోడు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను కేంద్రం ప్రోత్సహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో అంటే టోల్ ప్లాజాల వద్ద డిజిటల్గా టోల్ ఫీజు చెల్లించడానికి ‘ఫాస్టాగ్ (Fastag)’ విధానం తెచ్చింది.
ఈ ఫాస్టాగ్ విధానాన్ని వాహనదారులు ఇష్టారాజ్యంగా వాడుతుండటంతో కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) .. వారి నుంచి ఈ-కేవైసీ తీసుకోవాలని నిర్ణయించింది. గత నెలాఖరు వరకూ తొలుత గడువు విధించిన ఎన్హెచ్ఏఐ.. తాజాగా మరోమారు గడువు పొడిగించింది. ఈ నెల 29 వరకూ ఫాస్టాగ్ ఈ-కేవైసీ అప్ డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ గడువు తీరిన తర్వాత కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్ అకౌంట్లను డీయాక్టివేట్ చేస్తామని స్పష్టంగా తేల్చి చెప్పింది. ఫాస్టాగ్ వెబ్సైట్తోపాటు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ) వెబ్సైట్ ద్వారా వాహనదారులు తమ ఫాస్టాగ్ ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పేర్కొంది.
వాహనాల యజమానులు తమ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ తెలుసుకోవడానికి వెబ్సైట్ల లింక్పై క్లిక్ చేసి.. అటుపై మొబైల్ నంబర్, పాస్ వర్డ్ లేదా ఓటీపీ నమోదు చేసి లాగిన్ కావాలి. డాష్ బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్’ ఆప్షన్ ఎంచుకుంటే మీ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. కేవైసీ పూర్తి కాకుంటే అడిగిన వివరాలు నమోదు చేసి ప్రాసెస్ చేయాలి. ఎన్హెచ్ఏఐ వద్ద మీ మొబైల్ ఫోన్ నంబర్ రిజిస్టర్ కాకుంటే.. ‘మై ఫాస్టాగ్’ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో మీ ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలి. ఒకవేళ బ్యాంకులు జారీ చేసిన ఫాస్టాగ్లు అయితే.. ఆయా బ్యాంకుల శాఖకు వెళ్లి మొబైల్ ఫోన్ నంబర్ నమోదు చేసిన తర్వాత ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి.