హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): బొగ్గు ఉత్పత్తిలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ సూచించారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యం 70 మిలియన్ టన్నులను చేరుకోవాలంటే, ప్రతిరోజూ 2.24 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి, రవాణా చేయాలని బలరామ్ సూచించారు. గతేడాదితో పోల్చితే ఈయేడు మొదటి 9 నెలల కాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపు ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి ఎదురవుతున్న అవాంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఒడిశాలోని నైనీలో చేపట్టిన బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, త్వరలో ఆయన నేతృత్వంలో సింగరేణి అధికారుల బృందం ఆ రాష్ట్రంలో పర్యటిస్తుందని వెల్లడించారు. ఈ సమీక్షలో డైరెక్టర్లు డీ సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వర్రెడ్డి, ఈడీ జే ఆల్విన్, జీఎంలు సురేష్, జక్కం రమేశ్, మల్లెల సుబ్బారావు, జీ దేవేందర్, సూర్యనారాయణతోపాటు అన్ని ఏరియాల జీఎంలు, కార్పొరేట్ జీఎంలు పాల్గొన్నారు.