హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు, వారికి అందిస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నది. ఇందుకోసం ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘కూ’తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. ఇందుకు సంబంధించి బుధవారం హైదరాబాద్లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు మంచి వేదికగా దోహదపడుతుందన్న ఆలోచనతోనే ‘కూ’ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా వినూత్న సేవలను అందించేందుకు పలు టెక్ కంపెనీలు ముందుకొస్తున్నాయని, అలాంటి కంపెనీలను ప్రోత్సహించడంతోపాటు వాటితో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. సమాజానికి భాష ఆధారంగా సోషల్ మీడియా సేవలు అందించే కంపెనీల అవసరం ఎంతైనా ఉన్నదని ‘కూ’ కంపెనీ సీఈవో, కో-ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తమ కంపెనీ ద్వారా వివిధ భాషల్లో సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీకి ఇది ఎంతో కీలకమైనదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
అర్హతలు కలిగిన అభ్యర్ధులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎల్ అండ్ టీ మెట్రో రైలు (హైదరాబాద్), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా టాస్క్ తమ అభ్యర్థుల్లో మెరుగైన నైపుణ్యాన్ని పెంచి ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది ఎల్అండ్టీ, దీని అనుబంధ సంస్థయైన కియోలిస్ సంస్థలకు అభ్యర్థులను అందించనుంది.