ఈ రోజుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి మళ్లీ క్షేమంగా తిరిగి వచ్చేదాకా కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూనే ఉండే దుస్థితి నెలకొన్నది.
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలివాళ్ల అజాగ్రత్త, నిర్లక్ష్యం మనకు ప్రమాదాలను తెచ్చిపెడుతూనే ఉన్నాయి. ఏదో చిన్న దెబ్బ తగిలితే సర్దుకోవచ్చు. దవాఖానపాలైతే ఆరోగ్య బీమా కవరేజీ ఉందిలే అనుకోవచ్చు.
మరి ప్రమాదంలో కాలుకో, చెయ్యికో పాక్షికంగా లేదంటే శాశ్వతంగా ఇబ్బంది ఎదురైతే.. యాక్సిడెంట్ కారణంగా 2-3 నెలలు ఇంటికే పరిమితం కావాల్సి వస్తే.. పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఊహించామా? ఇందుకోసమే పుట్టుకొచ్చింది వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ.
దవాఖాన ఖర్చులకు ఆరోగ్య బీమా ఉపయోగపడుతుంది. ప్రమాదంలో ప్రాణంపోతే కనీసం టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీ కుటుంబానికి అండగా ఉంటుంది. కానీ ప్రమాదం జరిగి శరీర భాగాలకు ఏదైనా తీవ్రమైన గాయం తగిలినా, కొన్ని నెలలపాటు ఉద్యోగం, వ్యాపారానికి వెళ్లలేకపోయినా హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్లు పనికిరావు. అందుకే ఇలాంటి సమయంలో భరోసాగా నిలబడేది పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ.
పక్కాగా పనికొచ్చే పాలసీ
ప్రమాదం బారినపడి పనిచేయలేని పరిస్థితిలో ఉన్నవారికి ఈ వ్యక్తిగత ప్రమాద బీమా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పాక్షిక, శాశ్వత అంగవైకల్యాలకు గురైనప్పుడు ఊరటనిస్తుంది. ప్రమాదం కారణంగా నెలల తరబడి ఇంటికే పరిమితమైనప్పుడు యాక్సిడెంట్ పాలసీ నిజంగా కొండంత అండగా చెప్పుకోవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్ తరహాలోనే ఈ పాలసీలోనూ కుటుంబానికి మొత్తం పరిహారం దక్కుతుంది. కాళ్లు, చేతులు, కంటిచూపు కోల్పోవడం వంటి శాశ్వత వైకల్యాలకు 100 శాతం బీమా వర్తిస్తుంది.
ఆకర్షణీయ ప్రయోజనాలు
ప్రమాదాలు జరిగినప్పుడు కొంతకాలం విశ్రాంతి సాధారణమే. ఉద్యోగులైతే మళ్లీ మాములు స్థితికి వచ్చేదాకా ఉద్యోగానికి సెలవు పెట్టాల్సిందే. అలాంటప్పుడు మొత్తం సమ్ అష్యూర్డ్లో ఒక్క శాతం వరకూ బీమాదారుడికి చెల్లిస్తారు. అలాగే దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చేయించుకునే వైద్యం, మందులు ఇతర ఖర్చులకూ బీమా కవరేజీ వర్తిస్తుంది. కాగా, అదనంగా తీసుకునే ఆప్షన్స్ ద్వారా యాక్సిడెంటల్ హాస్పిటల్ డైలీ, వీక్లీ అలవెన్స్ వంటి ప్రయోజనాలనూ పొందవచ్చు. కొన్ని కంపెనీలు వారానికి గరిష్టంగా రూ.20వేలదాకా కూడా చెల్లిస్తున్నాయి. చాలా ఇన్సూరెన్స్ సంస్థలు బీమాదారుడు ప్రమాదానికి గురైనప్పుడు వారి పిల్లల చదువుకు కూడా కొద్దిమొత్తాన్ని సహాయంగా ఇస్తున్నాయి.
ఎవరెవరు అర్హులు?
18 నుంచి 65 ఏండ్ల వారెవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. దీనికి ముందస్తుగా ఎలాంటి వైద్య పరీక్షలూ అవసరం లేదు. తరచూ వాహనాల్లో తిరిగేవారు, ఇతర ప్రాంతాలు-నగరాలకు ఆఫీసు, వ్యాపారాల పనిమీద ప్రయాణించేవాళ్లకు ఇది ఎంతో ఆవశ్యకమైన పాలసీ. అయితే ప్రమాదకర ఆటల్లో పాల్గొన్నప్పుడు, ప్రెగ్నెన్సీ ఇబ్బందులు, ఆత్మహత్యల వంటి వాటికి ఈ పాలసీ వర్తించదు.
-నాగేంద్ర సాయి కుందవరం
ప్రీమియం ఎంత?
ఒక్కొక్కరికి లేదా కుటుంబం మొత్తానికి కూడా ప్రమాద బీమా పాలసీని తీసుకోవచ్చు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) తర్వాత చాలా కంపెనీలు ఈ పాలసీలను ఇస్తున్నాయి. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ప్రతి బీమా సంస్థ ఈ పాలసీని ఇవ్వాల్సి ఉంటుంది. రూ.10 లక్షల ప్రమాద బీమా పాలసీకి గరిష్ఠంగా రూ.500-1,000 మధ్య ప్రీమియం ఉన్నది. వీటికి అదనంగా యాడ్ ఆన్స్ తీసుకోవచ్చు. మెడికల్ ఖర్చులు, పిల్లల చదువు, ప్రమాదం అనంతరం సెలవులకు ఖర్చులు వంటి వాటికి యాడ్ ఆన్స్ ఉపయుక్తంగా ఉంటాయి. ఎస్బీఐ వంటి ప్రధాన బ్యాంకులు కూడా అతి తక్కువగా రూ.200 ప్రీమియంతో రూ.4 లక్షలకు బీమాను కల్పిస్తున్నాయి.